హైదరాబాద్ కొమురం భీమ్ ఆదివాసీ భవన్లో ‘మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్’లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ, ముస్లింలు తనకు రెండు కళ్ల లాంటివారని, మాటల్లో కాకుండా చేతల్లో సోనియా గాంధీ ఆ రీతిగా నిరూపించారని తెలిపారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తుచేస్తూ, తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లను తొలగిస్తామన్న అమిత్ షా సవాల్కు గుజరాత్లో ముందు తొలగించి చూపించాలని ఆరోపించామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేస్తోందని, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల్లో మైనారిటీ యువత మెరుగైన స్థానాలను సాధించారని స్పష్టం చేశారు.
గతంలో గ్రూప్ 1 ప్రశ్నపత్రాలు పల్లీ బఠానీల్లా అమ్ముడయ్యాయని, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అర్హత లేని వారిని నియమించారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి, యూపీఎస్సీని అధ్యయనం చేసి రిటైర్డ్ డీజీపీని చైర్మన్గా నియమించామని చెప్పారు. అభ్యర్థుల ఉద్యోగాల నియామకాన్ని అడ్డుకోవడానికి కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, మంచి అడ్వకేట్లతో పోరాడి అభ్యర్థుల తరఫున నిలబడి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మైనారిటీ సభ్యుడిని నియమించడమే కాకుండా, అజారుద్దీన్కు మంత్రి పదవి, నిఖత్ జరీన్కు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు రూ. 3 కోట్ల బహుమతి, మహమ్మద్ సిరాజ్కు నిబంధనలు సవరించి డీఎస్పీ ఉద్యోగాన్ని అందించామని వెల్లడించారు.
మైనారిటీ యువత చదువుతో పాటు నైపుణ్యాలను పెంచుకుని జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవాలని, అందుకోసమే స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని సూచించారు. కొందరు ‘SIR’ పేరుతో ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, బెంగాల్లో లాగా తెలంగాణలో కూడా గెలుస్తామని మాట్లాడుతున్నారని హెచ్చరించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా ఒక రేవంత్ రెడ్డిగా మారి ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు.

