CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో రెండు దశాబ్దాల ప్రయాణం తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయమని పేర్కొంటూ.. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

“లక్షల అక్షరాలతో రాసినా, కోట్ల పదాలతో చెప్పినా తరగని మధుర జ్ఞాపకం ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం” అంటూ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. నాడు మిడ్జిల్‌లో రేవంత్ రెడ్డిగా ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానం, నేడు ప్రజల గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే స్థాయికి చేరిందని అన్నారు. ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో ప్రజల కోసం చేసిన పోరాటాల్లో తన వెంట నడిచిన ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తన రాజకీయ జీవితంలో ప్రజల మద్దతు, కార్యకర్తల సహకారం ఎంతో కీలక పాత్ర పోషించాయని ఆయన రాసుకొచ్చారు.

అదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా “రేవంతన్న”గా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటానని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు #ZPTCToCM, #20YearsOfPoliticalJourney హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.