CM Relief Fund Scam:పేదల ఆరోగ్యం కోసం నిధులు కేటాయిస్తే వాటిని కూడా సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు కేటుగాళ్లు. ఏకంగా తెలంగాణ సెక్రటేరియట్ కేంద్రంగానే దందాకు తెరలేపారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు చెందిన19 చెక్కుల సొమ్ము కొట్టేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. పేద వారి ఆరోగ్యం కోసం ఉద్దేశించి ప్రభుత్వం నిధి ఏర్పాటు చేసింది. అందులో నుంచి పేదలు ఎవరైనా తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు.. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు విడుదల చేస్తారు. ఇప్పుడు ఆ నిధులు కొట్టేసేందుకు తెలంగాణ సెక్రటేరియట్లో కొన్ని చీడ పురుగులు తయారయ్యాయి.
కొంత మంది దుండగులు ఏకంగా 19 చెక్కులకు సంబంధించిన డబ్బులను కొట్టేశారు. తాజాగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ గోల్ మాల్ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను మెట్టుగూడకు చెందిన జోగుల నరేష్, వనస్థలిపురానికి వెంకటేశ్, ఖమ్మంకు చెందిన వంశీ, పెద్దపల్లికి చెందిన ఓంకార్గా గుర్తించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారడాన్ని వీరు తన సొంత ప్రయోజనం కోసం వాడుకున్నారు.
AI Video: వాస్తవాన్ని తలపించే నకిలీ వీడియో.. వీడియో వైరల్..!
సీఎం రిలీఫ్ ఫండ్లో 19 చెక్కుల కోసం ఎవరూ సంప్రదించడం లేదని గుర్తించారు. ఆ డబ్బును ఎలాగైనా కొట్టేయాలని డిసైడ్ అయ్యారు. ఇంకేముంది అనుకున్నదే తడవుగా స్కెచ్చేశారు. ఫోర్జరీ పత్రాలు తయారు చేశారు. తమ సొంత ఖాతాలకు ఆ నిధులను మళ్లించుకున్నారు. నిందితుల్లో ఒకరైన జోగుల నరేశ్ మాజీ మంత్రి పేషీలో పనిచేసినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన వ్యక్తుల పేరుతో జారీ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాజేసిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సిద్దిపేట జిల్లా చేరియాల్ మండలానికి చెందిన రాల్లబండి వెంకటేశ్ అనారోగ్య సమస్యలతో 2022 జూన్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు సర్జరీ పూర్తయింది. మూడునెలల తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల తన సీఎంఆర్ఎఫ్ చెక్కు గురించి వాకబ్ చేయగా రూ.45వేల చెక్కు జారీ అయినట్లు తెలిసింది. ఆ చెక్కు తీసుకుందామని వెళితే అప్పటికే తీసుకుని ఎవరో డబ్బులు డ్రా చేసుకున్నట్లు తేలింది. అంతే కాదు జూబ్లీహిల్స్లోని ఎస్బీఐలో చెక్కును వేసి డబ్బులు డ్రా చేసుకున్నట్లు తెలుసుకున్నాడు వెంకటేష్.
Hyderabad: ఇంటి దొంగ దొరికిందోచ్.. బెట్టింగ్కి బానిసై అన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డ సోదరి..
బాధితుడు వెంకటేష్ తన డబ్బులు గోల్మాల్ అయినట్లుగా గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టి నిందితులైన సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన జోగుల నరేశ్కుమార్, హస్తినాపురం ప్రాంతానికి చెందిన బాలగోని వెంకటేశ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇంకా ఈ వ్యవహారంపై దృష్టిసారించిన పోలీసులకు దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కొర్లపాటి వంశీ, గోదావరిఖనికి చెందిన పులిపాక ఓంకార్ పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. వీరంతా ముఠాగా ఏర్పడి 19 చెక్కులను బ్యాంక్లో వేసి డబ్బులు కాజేశారని తేలింది.
