CM Jagan: వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్

Jagan

Jagan

పేద పిల్లల చదువును ప్రొత్సహించే క్రమంలోనే.. వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఇవాళ వైఎస్సార్‌ కల్యాణమస్తు.. వైఎస్సార్‌ షాదీ తోఫా ఐదో విడత నిధుల్ని బటన్‌ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అంతకు ముందు వర్చువల్ గా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన 10,132 జంటలకు 78.53 కోట్ల రూపాయల సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. వధూవరులకు పదవ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరిగా చేశాం.. వధువు కనీస వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లుగా నిర్దేశించామని చెప్పారు.. వయసు పరిమితి పెట్టడం వల్లే రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గిపోయాయి.. దీంతో పేద పిల్లల చదువుల్ని ప్రోత్సహించినట్లు అవుతుంది అని సీఎం జగన్ వెల్లడించారు.

Read Also: Governor Tamilisai: గవర్నర్‌ ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌ షాకింగ్ విషయాలు.. ముంబై నుంచే..

ఇక, పేదల కుటుంబాలు అప్పుల పాలయ్యే పరిస్థితి రావొద్దు అని సీఎం జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం మొక్కుబడిగా సాయం అందించారు.. అప్పుడు అరకోరగా నిధులు అందించే పరిస్థితి ఉండేది.. కానీ, మా ప్రభుత్వ హాయాంలో ఏ త్రైమాసికంలో వివాహం జరిగితే.. ఆ త్రైమాసికం పూర్తైన వెంటనే సాయం అందిస్తున్నాం అని సీఎం అన్నారు. ఇప్పటి వరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.427.27 కోట్లు జమ చేసినట్లు వైఎస్ జగన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడ పిల్లలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు ద్వారా మైనార్టీ వర్గాల ఆడ పిల్లలకు వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా సీఎం జగన్‌ సర్కార్ ఆర్థిక సహాయన్ని అందిస్తోంది.