CM Chandrababu: పెట్టుబడులు పెట్టండి.. పేదలకూ సాయం చేయండి!

  • సింగపూర్ పర్యటనలో బిజీగా సీఎం చంద్రబాబు
  • ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షోలో సీఎం
  • రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్
Cm Chandrababu Singapore

Cm Chandrababu Singapore

CM Chandrababu Naidu Invites Investments to AP: పెట్టుబడులకు ఏపీ రైట్ ఛాయిస్ అని, సేఫ్ ప్లేస్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడులు పెట్టండి, పేదలకూ సాయం చేయండని కోరారు. ఏపీ-సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తాం అని, విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు రండని సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

‘సింగపూర్‌ ప్రభుత్వంతో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. ఎలాంటి ఉత్తమ విధానాలైనా సింగపూర్‌ నుంచే వస్తున్నాయి. స్వాతంత్య్రం తర్వాత మన నాయకులు మిళిత, సోషలిస్టు ఆర్థిక విధానాలు అవలంబించారు. 1947లోనే ఆర్థిక విధానాల్లో పోటీపడి ఉంటే.. భారత్‌ ఇప్పుడు మరోలా ఉండేది. భారత్‌ 1991లో ఆర్థిక సంస్కరణల బాట పట్టగా.. 13 ఏళ్లకు చైనా కూడా అవలంబించింది. 2014లో ఏపీ రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ కోసం ఇక్కడికి వచ్చాను. జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకే మరలా వచ్చా. ఫ్రీగా రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చేందుకు సింగపూర్‌ ముందుకు వచ్చింది. అభివృద్ధిలో భారత్‌ వేగంగా ముందుకు వెళుతోంది. అదే బాటలో ఆంధ్రప్రదేశ్ కూడా పయనించాల్సి ఉంది. పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి. స్పీడ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌పై దృష్టి పెట్టాం. నవంబర్‌ 14, 15 తేదీల్లో సీఐఐ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నాయి. సదస్సుకు సింగపూర్‌ ప్రతినిధులను ఆహ్వానిస్తున్నా’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read: FAPTO Demands: ఏపీ సీఎస్‌కు ఫ్యాప్టో లేఖ.. 18 డిమాండ్స్ ఇవే!

సింగపూర్ పర్యటనలో 3వ రోజూ సీఎం చంద్రబాబు కీలక సమావేశాలతో బిజీగా ఉండనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా ప్రతినిధులతో చర్చలు చేయనున్నారు. సింగపూర్ అధ్యక్షుడు, మాజీ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకోనుంది.