NTV Telugu Site icon

CM Biren Singh: “రాజీనామా ప్రసక్తే లేదు.. వచ్చే ఆరు నెలల్లో మణిపూర్ లో శాంతి ఖాయం!”

Cm Biren Singh

Cm Biren Singh

వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో సంపూర్ణ శాంతి నెలకొంటుందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు. పదవి నుంచి వైదొలగడానికి నిరాకరించిన ఆయన, తాను ఎలాంటి నేరం చేయలేదని, కుంభకోణం చేయలేదని చెప్పారు. గురువారం ఒక ఇంటర్వ్యూలో.. ఎన్ బీరెన్ సింగ్.. కుకీ-జో-మెయిటీ నాయకులతో మాట్లాడటానికి ఒక రాయబారిని నియమించినట్లు వెల్లడించారు. మణిపూర్‌లో 2023 మే నుంచి కుల హింస కొనసాగుతుండటం గమనార్హం. కుకీ-జో- మెయిటీ జాతుల మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటివరకు 226 మంది మరణించారు. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవచ్చని ఎన్ బీరెన్ సింగ్ అన్నారు. చర్చల కోసం సీఎం ఎన్ బీరేన్ సింగ్ నాగా ఎమ్మెల్యే.. హిల్ ఏరియా కమిటీ చైర్మన్ డింగ్ంగ్‌లుంగ్ గాంగ్‌మీ నియమించారు.

READ MORE: Carlos Alcaraz: సంచలనం.. రెండవ రౌండ్‌లోనే కార్లోస్ అల్కరాజ్‭కు ఎదురుదెబ్బ..

కాగా.. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మణిపూర్‌ రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి. జిరిబామ్ జిల్లాలో మైతీ వర్గానికి చెందిన సోయిబమ్ శరత్‌కుమార్ అనే వ్యక్తిని కుకీ మిలిటెంట్లు దారుణంగా హత్య చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శరత్‌ అనే వ్యక్తి తన పొలం నుంచి తిరిగి వస్తుండగా మాయమైపోయాడని, శరీరంపై పదునైన వస్తువుతో పొడిచినట్టు గాయాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే, స్థానికంగా ఉండే ఇళ్లకు నిప్పు పెట్టారు.. దీంతో జిరిబామ్ జిల్లా మేజిస్ట్రేట్ అల్లర్లను నిరోధించడానికి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించేశారు. ఘటనా తర్వాత అస్సాం రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, మణిపూర్ పోలీస్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ అధికారులతో కూడిన జాయింట్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. మరోవైపు మణిపూర్ హింసాకాండకు కీలకమైన నిందితుడు థోంగ్‌మింథాంగ్ హౌకిప్ అలియాస్ రోజర్‌ని ఈ నెల 6న ఇంఫాల్ లోని ఎయిర్ పోర్టులో ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. అతనిపై గతేడాది జూలై 18వ తేదీన ఎన్‌ఐఏ కేసు ఫైల్ చేసింది.