చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన సతీమణి లక్ష్మీ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, ఏ తప్పు చేయని చెవిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, త్వరలోనే చెవిరెడ్డి బయటకు వస్తారని లక్ష్మీ పేర్కొన్నారు. సిట్ అధికారులు బెంగళూరులో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 1 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్డుపైనే లక్ష్మీ నిరసన వ్యక్తం చేశారు.
Also Read: Encounter: మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి!
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం అత్యంత నాటకీయంగా బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. లుకౌట్ నోటీసులు ఉండటంతో చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సిట్ అధికారులు బెంగళూరుకు చేరుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చెవిరెడ్డిని విజయవాడకు తరలించారు. బుధవారం ఏసీబీ కోర్టులో చెవిరెడ్డిని ప్రవేశపెట్టనున్నారు.
