భారత మాజీ అగ్రశ్రేణి బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ శైలిపై ప్రశంసలు కురిపించారు. డిఫెన్సివ్ బౌలర్ నుంచి నిరంతరం వికెట్లు తీసే అటాకింగ్ బౌలర్గా మారడమే జడేజా టెస్టు క్రికెట్లో మరింత పరిణతి చెందడానికి కారణమని పుజారా అభిప్రాయపడ్డారు. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్కు ముందు పుజారా మాట్లాడుతూ.. గతంలో జడేజా పిచ్ నుంచి సహకారం లేనప్పుడు కేవలం పరుగులు నియంత్రించడానికే ప్రాధాన్యమిచ్చేవాడని, కానీ ఇప్పుడు తన బలాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తూ ప్రతి మ్యాచ్లోనూ స్టంప్స్ లక్ష్యంగా వికెట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ మార్పు అతనిలో మరింత వైవిధ్యాన్ని, దూకుడును పెంచిందని తెలిపారు. జడేజా ఇప్పటివరకు 89 టెస్టుల్లో 25.12 సగటుతో 348 వికెట్లు తీశారు.
మరోవైపు రవీంద్ర జడేజా దాదాపు 7 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేస్తున్నారు. ఆయన చివరిసారిగా జనవరి 18, 2026న న్యూజిలాండ్తో ఇండోర్లో జరిగిన మ్యాచ్లో ఆడారు. గత ఏడాది నవంబర్లో దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్టు ఆడిన తర్వాత, అఫ్గానిస్థాన్తో జరిగిన టెస్టు మ్యాచ్తో పాటు ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్లతో జరిగిన వన్డే సిరీస్లకు కూడా దూరంగా ఉన్నారు.
వన్డే జట్టులో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లకు అవకాశాలు లభిస్తుండటంతో 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో జడేజా ప్రాధాన్యత తగ్గినా, టెస్టు ఫార్మాట్లో మాత్రం ఆయన స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యంగా మారింది. టీ20 ప్రపంచకప్ 2024 విజయం తర్వాత పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పిన జడేజా, ప్రస్తుతం టెస్టుల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ ఆల్రౌండర్గా కొనసాగుతున్నారు. 446 రేటింగ్ పాయింట్లతో ఉన్న జడేజా, రెండో స్థానంలో ఉన్న మార్కో యాన్సెన్ కంటే 102 పాయింట్లు ముందంజలో ఉండి తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు.

