Chandrababu and YS Jagan: సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ఇక, రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది నాల్గోసారి కాగా.. నవ్యాంధ్ర సీఎంగా రెండోసారి.. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అగ్రనేతలు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్స్టార్ రజనీకాంత్.. ఇలా ఎందరో ప్రముఖులు తరలిరానున్నారు.. నందమూరి, నారా ఫ్యామిలీలు కూడా సందడి చేయనున్నాయి.. అయితే, ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా ఆహ్వానించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు.. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదట..
Read Also: Schools Reopen: బడికి వేళాయే.. రేపటి నుండి తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం
తన ప్రమాణస్వీకారానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ను స్వయంగా ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నం చేశారు.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు టీడీపీ అధినేత.. కానీ, ఫోన్ కాల్కు వైఎస్ జగన్ అందుబాటులోకి రానట్టుగా చెబుతున్నారు. కాగా, రేపు ఉదయం 11.27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు చంద్రబాబు.. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ రాశారు.. రేపు ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా చంద్రబాబుకు లేఖ అందజేశారు గవర్నర్.. ఇక, శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనందుకు చంద్రబాబుకు గవర్నర్ అభినందనలు తెలిపారు.