మహిళల టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్ చేతిలో శ్రీలంక ఓటమి పాలైన తర్వాత, ఆ జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ ఓటమితో శ్రీలంక సెమీఫైనల్ అవకాశాలు దాదాపు సంక్లిష్టంగా మారాయి. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తన 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో వ్యక్తిగత మైలురాళ్లను అందుకున్నప్పటికీ, కెప్టెన్గా జట్టును కనీసం ఒక్కసారి కూడా ప్రపంచకప్ సెమీఫైనల్కు చేర్చలేకపోయానని, అందువల్ల ఒక కెప్టెన్గా తాను పూర్తిగా విఫలమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధ తనను ఎప్పటికీ వెంటాడుతుందని కన్నీటి పర్యంతమయ్యారు.
బాధ్యత నాదే..
వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 98 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తరుణంలో.. చమరి ఆటపట్టు కూడా కేవలం మొదటి మూడు ఓవర్లలోనే అవుట్ అయిన వారిలో ఒకరిగా నిలిచారు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ఆమె ఒప్పుకున్నారు. మరింత బాధ్యతాయుతంగా ఆడి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని, జట్టులో అత్యంత అనుభవజ్ఞురాలైన ప్లేయర్గా తానే విఫలం కావడం తీవ్రంగా కలచివేస్తోందని, బహుశా ప్రపంచకప్ గెలిచే చివరి అవకాశాన్ని తాను కోల్పోయానని పేర్కొన్నారు.
భవిష్యత్తుపై సందిగ్ధత..
2009 నుండి ఇప్పటివరకు జరిగిన ప్రతి టీ20 ప్రపంచకప్లోనూ చమరి భాగస్వామిగా ఉన్నారు. లంక తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆమె పేరిటే ఉంది. కెప్టెన్గా 114 మ్యాచులలో 49 విజయాలు, 62 ఓటములను ఆమె చూశారు. హర్మన్ప్రీత్ కౌర్ (145 మ్యాచులు) తర్వాత అత్యధిక మ్యాచులకు కెప్టెన్సీ వహించిన రికార్డు చమరిదే.
ప్రస్తుతం ఆమె వయసు 36 సంవత్సరాలు. 2028లో పాకిస్తాన్లో జరగబోయే తదుపరి టీ20 ప్రపంచకప్లో ఆడటంపై ఆమె స్పందిస్తూ.. “ప్రస్తుతానికి నా భవిష్యత్తుపై ఏమీ చెప్పలేను. నా వయసు రీత్యా ఫిట్నెస్, నైపుణ్యాలు ఎలా ఉంటాయో చూసుకోవాలి. జట్టుకు నా అవసరం ఉండి, నా ఫిట్నెస్ సహకరిస్తేనే భవిష్యత్తులో ఆడటంపై నిర్ణయం తీసుకుంటాను” అని స్పష్టం చేశారు.

