Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్‌.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!

Google Chrome Security Warn

Google Chrome Security Warn

Google Chrome Security Warning: ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం కోట్లాది మంది ఉపయోగించే Google Chrome బ్రౌజర్‌పై భారత ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. హ్యాకర్లు క్రోమ్‌లో ఉన్న భద్రతా లోపాలను ఉపయోగించి వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలను దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారత ప్రభుత్వానికి చెందిన CERT-In (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) తాజా అడ్వైజరీలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం క్రోమ్ బ్రౌజర్‌లో కొన్ని సెక్యూరిటీ లోపాలు గుర్తించినట్లు తెలిపింది.

హ్యాకర్లు ఎలా దాడి చేస్తారు?
CERT-In ప్రకారం, వినియోగదారులు అనుమానాస్పద వెబ్‌సైట్లను ఓపెన్ చేయడం లేదా తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉంది. ఈ భద్రతా లోపాలను ఉపయోగించి హ్యాకర్లు ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి చొరబడి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించగలరు. ఇందులో బ్యాంక్ ఖాతా వివరాలు, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత డేటా వంటి సమాచారం కూడా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి వినియోగదారుల కార్యకలాపాలను గమనించే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

కెమెరా, మైక్రోఫోన్‌కూ ప్రమాదం
ఈ భద్రతా లోపాల వల్ల హ్యాకర్లు డివైస్ కెమెరా, మైక్రోఫోన్‌లను కూడా యాక్సెస్ చేసే అవకాశం ఉందని హెచ్చరికలో పేర్కొన్నారు. దీంతో వ్యక్తిగత గోప్యతకు పెద్ద ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. సైబర్ నేరగాళ్లు ఈ సమాచారాన్ని ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేయడం లేదా ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వెంటనే చేయాల్సిన పని ఇదే
ఈ ముప్పు నుంచి రక్షించుకోవాలంటే వెంటనే క్రోమ్ బ్రౌజర్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలని CERT-In సూచించింది. కొత్త అప్‌డేట్‌లలో పాత భద్రతా లోపాలను సరిచేసే ప్యాచ్‌లు ఉంటాయి. పాత వెర్షన్ ఉపయోగిస్తున్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది. అందుకే వెంటనే అప్‌డేట్ చేసుకోవడం అత్యంత అవసరమని నిపుణులు చెబుతున్నారు.

సైబర్ మోసాల నుంచి ఎలా జాగ్రత్త పడాలి?
* తెలియని లింక్‌లపై క్లిక్ చేయొద్దు
* అనుమానాస్పద వెబ్‌సైట్లను ఓపెన్ చేయొద్దు
* బ్రౌజర్, ఫోన్, యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి
* బ్యాంక్ OTPలు, పాస్‌వర్డ్‌లు ఎవరితోనూ పంచుకోకూడదు
* రెండు దశల భద్రత (2FA) తప్పనిసరిగా ఆన్ చేయాలి

ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.