Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!

India E85 Ethanol Fuel

India E85 Ethanol Fuel

Excise Duty: పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ముడి చమురు సరఫరాలో ఏర్పడిన ఈ అంతరాయం నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. దీనివల్ల దేశీయంగా ఇంధన ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్యుడిపై భారాన్ని పెంచుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఇంధన సంక్షోభాన్ని నివారించడానికి, ధరలను అదుపులో ఉంచడానికి భారత ప్రభుత్వం ఒక వ్యూహాత్మక, సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

ఎక్కువ పరిమాణంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ (ఉత్పత్తి సుంకం)ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. 22 శాతం నుంచి 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉన్న పెట్రోల్‌ను ఎక్సైజ్ డ్యూటీ పరిధి నుంచి పూర్తిగా మినహాయించారు. అంటే ఇకపై మార్కెట్లోకి వచ్చే ఇ-22 (E-22), ఇ-25 (E-25), ఇ-27 (E-27), ఇ-30 (E-30) కేటగిరీల పెట్రోల్‌పై ఎలాంటి ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

×
×
Ad

ప్రభుత్వం తీసుకున్న ఈ భారీ నిర్ణయం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీల నుంచి మొదలుకొని సాధారణ వినియోగదారులు, అన్నదాతలకు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇథనాల్ బ్లెండింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా పెట్రోల్ ధరలను స్థిరీకరించవచ్చని, అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా, పెట్రోల్ డిమాండ్-సప్లైల మధ్య సరైన సమతుల్యతను కాపాడటానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది. ఇథనాల్ ఉత్పత్తి నేరుగా వ్యవసాయ రంగంతో ముడిపడి ఉండటం వల్ల, దేశీయంగా దీనికి డిమాండ్ పెరిగితే రైతులకు అదనపు ఆదాయం లభించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.