Case Registered on Balka Suman: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయమై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో స్పందిస్తూ బాల్క సుమన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. పోలీసులు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని చర్యలు చేపట్టాలని కోరారు.
సింగరేణి ఆస్తులను తగలబెట్టాలని, మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వంపై కుట్ర పన్నే విధంగా వ్యాఖ్యలు చేశారనే కోణంలో కూడా కేసు నమోదు చేయాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకట్.. “నేరం చేయడం ఎంత తప్పో, నేరాన్ని ప్రోత్సహించేలా మాట్లాడటం కూడా అంతే నేరం. బాల్క సుమన్ ఒక సంఘ విద్రోహ శక్తిలా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజకీయ స్వార్థం కోసం ప్రజల జీవితాలను పణంగా పెడుతున్నారు” అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల ఆందోళనలకు రైతుల మద్దతు లేదని, ధాన్యం కొనుగోళ్ల అంశంలో రైతుల ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఉద్యమాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం బీఆర్ఎస్ నేతల పాత రాజకీయమని వెంకట్ విమర్శించారు. గతంలో జరిగిన ఘటనలపై కూడా సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్ను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే తనపై వస్తున్న ఆరోపణలను బాల్క సుమన్ ఖండించారు. కాంగ్రెస్ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. “నేను మాట్లాడిన విషయాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సింగరేణిలో స్కాంలు జరుగుతున్నాయని, వాటిపై పోరాటం చేయాలని మాత్రమే చెప్పాను” అని తెలిపారు. తనపై ఫాబ్రికేటెడ్ వీడియో తయారు చేశారని, రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. “నా మీద గతంలో కూడా వందల కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. నేను అరగంట మాట్లాడితే అందులో ఒక చిన్న భాగాన్ని తీసుకుని రచ్చ చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాట్లాడారని, ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ఈ వివాదాన్ని సృష్టిస్తోందని బాల్క సుమన్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీలు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ కార్యక్రర్తలు మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలి అంటూ బాల్క సుమన్ పిలుపునిచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లోనూ మరో ఫిర్యాదు అందచేశారు కాంగ్రెస్ నాయకులు. సుమన్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
