CA Exams to be conducted thrice a year instead of twice: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఛార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) చదివే విద్యార్థులకు శుభవార్త. సీఏ పరీక్షలు ఇక నుంచి ఏడాదికి మూడుసార్లు జరగనున్నాయి. మార్చి 7న జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) 430వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సంవత్సరానికి రెండుసార్లు చొప్పున మే/జూన్లో ఒకసారి, నవంబరు/డిసెంబరులో మరోసారి సీఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షలను మూడుసార్లు నిర్వహించాలని ఐసీఏఐ నిర్ణయించింది.
జనవరి, మే/జూన్ మరియు సెప్టెంబర్ నెలల్లో పరీక్షలు నిర్వహించాలని కౌన్సిల్ నిర్ణయించింది. విషయాన్ని సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు ఎక్స్ ద్వారా వెల్లడించారు. త్వరలోనే ఐసీఏఐ వెబ్సైట్ అధికారికంగా వెల్లడించనుందని సమాచారం. ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్షలు రాయడానికి అర్హులు. ఇక సీఏ పరీక్షలు మూడు స్థాయిల్లో ఉంటాయన్న విషయం తెలిసిందే. సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్గా ఉంటాయి. తొలుత ఫౌండేషన్ పరీక్ష ఉత్తీర్ణులైతే.. సీఏ ఇంటర్లో పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇంటర్లో రెండు గ్రూపులు పాసైన తర్వాత సీఏ ఫైనల్ పరీక్షలకు హాజరుకావొచ్చు.
Also Read: Krithi Shetty: పింక్ స్టైలిష్ లుక్ లో బేబమ్మ ఎంత అందంగా ఉందో..
ఒకవేళ డిగ్రీ పూర్తయిన విద్యార్థులైతే ఫౌండేషన్ పరీక్ష రాయకుండానే.. నేరుగా సీఏ ఇంటర్ పరీక్షలకు హాజరవ్వొచ్చు. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 1.25 లక్షల మంది ఫౌండేషన్ కోర్సులో ప్రవేశాలు పొందుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం సీఏ పరీక్షలను ఏడాదికి మూడుసార్లు ఐసీఏఐ నిర్వహిస్తోంది. ఈ నిర్ణయంతో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. అలాగే పరీక్షల మధ్య విరామం 2 నెలలు తగ్గింది.