హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు రక్షించి వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. హర్యానాలోని మహేంద్రగఢ్ కనీనాలో ఈ ప్రమాదం జరిగింది.
గురువారం రంజాన్ సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు సెలవులు ఉన్నాయి. కానీ హర్యానాలోని జీఎల్ పబ్లిక్ స్కూల్ మాత్రం పాఠశాల నిర్వహిస్తోంది. ఈ ఉదయం విద్యార్థులను తీసుకుని బస్సు స్కూల్ దగ్గరకు వెళ్తుండగా కనీనాలోని ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. అధిక సంఖ్యలో గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం పెద్ద ఎత్తున సంఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రమాద స్థలం దగ్గర పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రాథమిక విచారణలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. జిల్లా యంత్రాంగం గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆరేళ్ల క్రితం 2018లోనే బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిందని అధికారులు వెల్లడించారు.
#WATCH | Five students dead, 15 injured after a private school bus meets with an accident in Mahendragarh's Kanina, in Haryana. pic.twitter.com/jhRvJo0hXg
— ANI (@ANI) April 11, 2024