Union Budget 2026: ఈ రోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుంది. ఉదయం 11 గంటలకు లోక్ సలో బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. అయితే, ఏప్రిల్ 2026 నుంచి మార్చి 2027 వరకు అమలు అయ్యే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగించడం, ఆర్థిక క్రమశిక్షణను కాపాడటం, అలాగే, అమెరికా విధించిన టారిఫ్లు వంటి గ్లోబల్ వాణిజ్య ఒత్తిళ్ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించే సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Bollywood : ప్రియాంకను బాలీవుడ్ సరిగ్గా వాడుకోలేదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
ఆర్థిక వృద్ధిపై దృష్టి:
ఇప్పటి వరకు ఆదాయ పన్ను, జీఎస్టీ కోతలు, మౌలిక సదుపాయాలపై ఖర్చు, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపులు భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తి బలాన్ని ఇచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ల ప్రభావాన్ని కూడా భారత్ తట్టుకునేలా చేశాయి. అయితే, ఈ వృద్ధి ఊపును కొనసాగించేందుకు కొత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సవాళ్ల మధ్య బడ్జెట్:
దేశీయ డిమాండ్ స్థిరంగా ఉండటం, ద్రవ్యోల్బణం కొంతమేర తగ్గడం సానుకూల అంశాలుగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కమోడిటీ ధరల హెచ్చుతగ్గులు, ప్రధాన కేంద్ర బ్యాంకుల అసమాన వడ్డీ విధానాలు ఆర్థిక భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతుంది.
Read Also: Union Budget 2026-27: హడావుడి కాదు.. లెక్కలే కీలకం.. గత బడ్జెట్లో అంచనాలు ఫలించాయా?
ఉపాధి పెంపుపై ఒత్తిడి:
భారతదేశంలో వినియోగాన్ని పెంచడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడం వంటివి వేగవంతం చేయడం, మూలధన వ్యయాన్ని పెంచడం లాంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అలాగే, ఆర్థిక లోటును నియంత్రణలో ఉంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలో నియంత్రణలను సరళీకరించడం, నిర్మాణాత్మక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై బడ్జెట్లో దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది.
ఎన్నికల రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు?:
ఖజానాపై ఒత్తిడి ఉన్నప్పటికీ వ్యయ కోతలు ఉండకపోవచ్చని అంచనా.. అయితే, త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం లాంటి రాష్ట్రాలకు సంబంధించి కొత్త పథకాలు లేదా ఇప్పటికే ఉన్న పథకాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది.
Read Also: Ishan Kishan Century: ఈ సెంచరీని ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదు.. నా టార్గెట్ అదే!
బడ్జెట్ 2026పై మధ్యతరగతి ఆశలు:
అయితే, మధ్య తరగతి ప్రజలు గృహ రుణాలు, ఆరోగ్య బీమా, ఎలక్ట్రిక్ వాహనాలు, దేశీయ ఎలక్ట్రానిక్స్పై పన్ను రాయితీలు ఆశిస్తున్నారు. ఆరోగ్య బీమా ప్రీమియాలపై కొత్త పన్ను విధానంలోనూ సెక్షన్ 80D తరహా మినహాయింపులు ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీంతో రూ.25,000 నుంచి రూ.50,000 వరకు డిడక్షన్ లభించే ఛాన్స్ ఉంది. ఇక, జీవన రక్షక ఔషధాలు, కీలక వైద్య పరికరాలపై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తే చికిత్స ఖర్చులు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
అలాగే, అందుబాటులోకి గృహాల రంగంలోనూ ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని మధ్య తరగతి ప్రజలు ఆశిస్తున్నారు. గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచితే ఇల్లు కొనుగోలు చేయాలనుకుని అనుకునే వారికి భారీ ఊరట లభించనుంది అని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.
