వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. ఇవాళ ఉదయం 6.30కి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన లొంగిపోయారు. హైకోర్ట్ ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు అనిల్ తిరిగి వచ్చారు. నిన్న సాయంత్రం 5 గంటలకే మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. అయితే గడువు ముగిసిన 12 గంటల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్ తిరిగి హాజరు అయ్యారు.
తన మధ్యంతర బెయిల్ మరోసారి పొడిగించాలని బోరుగడ్డ అనిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళావారం విచారణ జరిగింది. బెయిల్ పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. తక్షణమే లొంగిపోవాలని హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న గడువులోగా సెంట్రల్ జైలుకు తిరిగి రాకపోవడంతో.. రాజమండ్రి జైలు అధికారులు హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ పై కోర్టు ధిక్కరణ నేరం కింద పరిగణించే అవకాశం ఉంది. తల్లికి అనారోగ్యం పేరుతో ఇటీవల ఆయన బెయిల్ పొందారు. ఈ నెల 1న మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నారు. టీడీపీ నేతలను దూషించిన కేసులో బోరుగడ్డ అనిల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.