Nursing College Marriage Ban: విద్యార్థినులు చదువుకునే సమయంలో పెళ్లి చేసుకోకూడదని, ఒకవేళ చేసుకుంటే వారి అడ్మిషన్ రద్దు చేస్తామని బీహార్లోని ఒక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గోపాల్గంజ్ జిల్లా హథువాలోని జిఎన్ఎం (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ) శిక్షణ సంస్థ ఈ వివాదాస్పద నోటీసును జారీ చేసింది.
READ ALSO: Fake Letters: పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎర.. సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ..
వైరల్ అయిన ‘వింత’ ఉత్తర్వు
కళాశాల ప్రాంగణంలో నోటీసు బోర్డుపై ఉంచిన ఈ ఉత్తర్వు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. “శిక్షణ సమయంలో ఏ విద్యార్థిని కూడా వివాహం చేసుకోకూడదు. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వారి అడ్మిషన్ వెంటనే రద్దు చేయబడుతుంది” అని ఆ నోటీసులో కాలేజీ సిబ్బంది పేర్కొన్నారు. ఇది విద్యార్థినుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు.
ప్రిన్సిపాల్ వివరణ ఇదే..
ఈ వివాదంపై కాలేజీ ప్రిన్సిపాల్ మాన్సీ సింగ్ స్పందిస్తూ వింత వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సింగ్ కోర్సు అనేది పూర్తిగా రెసిడెన్షియల్ (వసతి గృహంలో ఉండి చదువుకునేది) అని, శిక్షణ సమయంలో పెళ్లి చేసుకుంటే విద్యార్థినుల చదువు, ప్రాక్టీస్ దెబ్బతింటుందని వాదించారు. ఇది కొత్త నియమం కాదని, అడ్మిషన్ సమయంలోనే తాము బాండ్ పేపర్ మీద సంతకాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విషయం వైరల్ కావడంతో జిల్లా ఆరోగ్య శాఖ ఈ ఉత్తర్వుపై స్పందించింది. గోపాల్గంజ్ సివిల్ సర్జన్ డాక్టర్ బీరేంద్ర ప్రసాద్ ఈ అంశంపై విచారణ జరిపి, ప్రిన్సిపాల్ జారీ చేసిన ఆదేశాలను తక్షణమే రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ, ప్రిన్సిపాల్కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. సరైన సమాధానం ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) పవన్ కుమార్ సిన్హా, హథువా ఎస్డీఎంకు విచారణ బాధ్యతలు అప్పగించారు. 24 గంటల్లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న ఈ నిబంధనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
READ ALSO: Shapoor Zadran: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. ఐసీయూలో చేరిన స్టార్ బౌలర్!
