బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న ప్రసిద్ధ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ వైభవంగా ప్రారంభానికి సిద్ధమైంది. తాజాగా విడుదలైన లాంచింగ్ ప్రోమో ఈ సారి షో ఏ రేంజ్లో ఉండబోతుందో ముందే చూపించింది. నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ “ఈ సారి ఆటలో సవాల్ కాదు.. ఆటే ఒక సవాల్” అని గంభీరంగా వ్యాఖ్యానించి ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేశారు. పదవ సీజన్కు అనుగుణంగా ‘దశావతారం’ అనే ప్రత్యేక కాన్సెప్ట్తో సరికొత్త ఆశ్చర్యాలు సిద్ధం చేసినట్లు నాగార్జున ప్రోమో ద్వారా స్పష్టం చేశారు. అంతేకాకుండా, తొలిరోజే డిజిటల్ మాధ్యమం ద్వారా ఇతర భాషల బిగ్ బాస్ వ్యాఖ్యాతలైన విజయ్ సేతుపతి, మోహన్ లాల్, సుదీప్లతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయి వినోదాన్ని పండించారు.
ఈ సీజన్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో పలువురు సినీ ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా మెరిసి సందడి చేయనున్నారు. కోలీవుడ్ కథానాయకుడు కార్తీ తన ‘సర్దార్ 2’ సినిమా ప్రచారంలో భాగంగా ఈ వేదికపైకి రాగా, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తన ‘ఎపిక్’ చిత్ర బృందంతో కలిసి నాగార్జునతో సందడి చేశారు.
ఈ సారి హౌస్లోకి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు అడుగుపెడుతున్నారు. అందులో 10 మంది సెలెబ్రెటీలు ఉండగా, మరో 6 మంది సామాన్యుల కోటాలో ప్రవేశిస్తున్నారు. లీక్ల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. సెలెబ్రెటీల విభాగంలో ఆటో రాంప్రసాద్, టెంపర్ వంశీ, దేబ్జానీ మోదక్, యాంకర్ వర్షిణి, ముఖేష్ గౌడ, చైత్రా రాయ్, నటుడు కృష్ణుడు, జబర్దస్త్ నరేశ్, యాంకర్ సుధీర్ రెడ్డి ఉన్నారు. ఇక ‘అగ్ని పరీక్ష’ ప్రత్యేక ఎంపిక రౌండ్ ద్వారా ఆరుగురు సామాన్యులు హౌస్లోకి అడుగుపెడుతున్నారు. వీరిలో ఝాన్సీ ఇప్పటికే ఫినాలే రౌంట్లో టికెట్ టు బిగ్ బాస్ హౌస్ గెలుచుకొని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమెతో పాటు.. రోహిత్ నాయుడు, శ్రష్టి, చరణ్, అమన్ మసూద్, షాలిని పటేల్ ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సీజన్ 10 లాంచింగ్ ఎపిసోడ్ ఈ రోజే సాయంత్రం 7 గంటలకు ‘స్టార్ మా’ టీవీ ఛానెల్తో పాటు ‘జియో హాట్స్టార్’ ఓటీటీ ప్లాట్ఫారమ్లో ప్రసారం కానుంది. విభిన్న నేపథ్యాలు, సరికొత్త సవాళ్లతో రూపుదిద్దుకున్న ఈ పదో సీజన్ మునుపటి కంటే మరింత ఉత్కంఠభరితంగా సాగనుందనడంలో సందేహం లేదు.

