Bhogapuram International Airport: భోగాపురం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్.. ఎయిర్‌లైన్స్ షెడ్యూల్ ఖరారు

Bhogapuram International Ai

Bhogapuram International Ai

Bhogapuram International Airport: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయం కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం అనగా ఆగస్టు 1వ తేదీన ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి ASR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఉన్న VTZ కోడ్‌తోనే కొత్త విమానాశ్రయం సేవలు కొనసాగనున్నాయి.

ఆగస్టు 17వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానుండగా, అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండే షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌కు రోజూ ఐదు, బెంగళూరుకు రెండు, విజయవాడకు నాలుగు విమాన సర్వీసులు నడవనున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు మెరుగైన వైమానిక అనుసంధానం అందుబాటులోకి రానుంది.

అంతర్జాతీయ సేవల విషయంలో కూడా భోగాపురం విమానాశ్రయానికి మంచి ప్రాధాన్యం లభిస్తోంది. ప్రస్తుతం విశాఖ–సింగపూర్ మధ్య వారానికి మూడు రోజులుగా నడుస్తున్న స్కూట్ ఎయిర్ సర్వీసులు ఆగస్టు 17 నుంచి వారానికి నాలుగు రోజులకు పెరగనున్నాయి. అలాగే అబుదాబీకి విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. ఈ మార్గంలో కూడా వారానికి నాలుగు రోజుల పాటు విమానాలు నడిపేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో పర్యాటకం, వాణిజ్యం, ఐటీ, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. వచ్చే 30 సంవత్సరాల పాటు షెడ్యూల్ విమానాల కార్యకలాపాలు ఈ విమానాశ్రయం నుంచే కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.