Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నామని తెలిపారు. అమెరికాలో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్, ఐదేళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ ప్లాన్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడుగా ముచ్చర్లలో నెట్-జీరో ప్రమాణాలతో నాలుగో మహానగరంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మిస్తున్నామని, రాష్ట్రాన్ని సియుఆర్ఇ (CURE), పియుఆర్ఇ (PURE), ఆర్ఎఆర్ఇ (RARE) వర్గాలుగా విభజించి అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

విద్యా రంగంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, టాటా గ్రూప్‌ భాగస్వామ్యంతో రూ. 2,100 కోట్లతో ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణ, 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం వంటి విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లో ఆక్రమణలపై ‘హైడ్రా’ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, మూసీ నదిని లండన్ థేమ్స్ తరహాలో రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక విచ్ఛిన్నత వల్ల జీతాలు ఆలస్యమయ్యేవని, తమ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక క్రమశిక్షణతో ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని, ఉద్యోగులకు రూ. 1.20 కోట్ల ఉచిత ప్రమాద బీమా కల్పిస్తున్నామని తెలిపారు. ఆరు గ్యారెంటీలను వేగంగా అమలు చేస్తున్నామని, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, విదేశీ పెట్టుబడులతో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఐఓసీ నాయకులు పాల్గొన్నారు.