Belagavi Honeytrap: సోషల్ మీడియాను వినోదం కోసం కాకుండా.. విలాసవంతమైన జీవితం కోసం మోసాలకు సాధనంగా మార్చుకున్న ఓ కిలాడీ లేడీ ఉదంతం కర్ణాటకలో వెలుగుచూసింది. ఇన్స్టాగ్రామ్లో అందమైన ఫోటోలతో ఎర వేసి, ధనవంతులను లాడ్జీలకు పిలిపించి, అందినకాడికి దోచుకుంటున్న ‘హనీట్రాప్’ ముఠా గుట్టును తిలక్వాడి పోలీసులు రట్టు చేశారు. బాగల్కోట్ జిల్లా మహాలింగపూర్కు చెందిన దీపా అవతగి (33) వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. ఈమె ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ధనవంతుల ప్రొఫైల్స్ను టార్గెట్ చేసేది. ముందుగా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి, ఆపై తియ్యని మాటలతో వారి నమ్మకాన్ని సంపాదించుకునేది. వారితో పరిచయం కాస్త ముదిరిన తర్వాత ఏకాంతంగా కలుద్దామంటూ హోటళ్లు లేదా లాడ్జీలకు ఆహ్వానించేది.
READ ALSO: Special Report : గ్రానైట్ పరిశ్రమకు యుద్ధ సెగ.. సంక్షోభంలో వేలాది మంది కార్మికులు..
స్కెచ్ అదిరిపోయింది కానీ..
బాధితులు ఆమెను నమ్మి లాడ్జీకి రాగానే అసలు కథ మొదలయ్యేది. మాటల్లో దించి బాధితులను స్నానం చేయమనో లేదా ఫ్రెష్ అవ్వమనో బాత్రూంకు పంపేది. వారు లోపలికి వెళ్లగానే గదిలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు, చివరకు వారి కారు తాళాలు కూడా తీసుకుని అక్కడి నుంచి మెరుపు వేగంతో పారిపోయేది. దోచుకున్న వస్తువులతో ఆగకుండా, బాధితులకు ఫోన్ చేసి అసలు వేధింపులు మొదలుపెట్టేది. “డబ్బు ఇస్తేనే నీ కారు, వస్తువులు తిరిగి ఇస్తా.. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తా” అని బెదిరించేది. సమాజంలో పరువు పోతుందన్న భయంతో చాలా మంది ఆమె అడిగినంత ఇచ్చుకున్నారు. అయితే, ఓ బాధితుడు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కిలాడీ లేడీ నెట్వర్క్ బయటపడింది.
పోలీసుల యాక్షన్..
తిలక్వాడి పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో దీపను అరెస్టు చేశారు. విచారణలో ఆమె అనేక సంచలన విషయాలు వెల్లడించింది. ఈ దోపిడీల్లో ఆమెకు హుక్కేరికి చెందిన శివానంద్ మతపతి అనే వ్యక్తి సహకరిస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని చెప్పారు. ఇప్పటివరకు ఈమె చేతిలో ఎంత మంది మోసపోయారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు, ముఖ్యంగా ఏకాంతంగా కలవమన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Amit Mishra: స్టార్ క్రికెటర్ డార్క్ సైడ్ బయటపెట్టిన భార్య!
