Beer Sales: ఏప్రిల్ మధ్యలో ఉంది.. ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి నాలిక పిడచకట్టుకుపోతోంది. ఉపశమనానికి కూల్ డ్రింక్లు, కొబ్బరిబోండాలు, జ్యూస్లు తాగుతాం. కానీ మందుబాబులు మాత్రం బీరు మీద బీరు లాగించేస్తున్నారు. దీంతో కేసులకు కేసులు బీర్లు బాటిళ్లు ఖాళీ అవుతున్నాయి.. మండే ఎండల నుంచి కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఒక్కొక్కరు ఒక్కో మర్గాన్ని ఎన్నుకుంటారు. అదే మందు టచ్ ఉన్నవారైతే వేసవిలో ఎక్కువగా బీర్ల వైపే చూస్తారు. 45 డిగ్రీలు క్రాస్ చేస్తూ సూర్యారావ్ మంటెక్కించేస్తుండడంతో బీర్ల అమ్మకాలు ఏపీలో ఓ రేంజ్లో పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే బీరు విక్రయాలు 30 శాతం ఎక్కువగా సాగుతున్నాయి. వచ్చే రెండు మాసాల్లో ఎండలు మరింత పెరగనుండడంతో అమ్మకాల జోరు భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: RCB-POTM: ఆర్సీబీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ల వర్షం.. అయితే ఎవ్వరూ మనోళ్లు కాదు సుమీ!
తాజాగా వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మందుబాబులు లిక్కర్కు బదులు బీరు మీద పడ్డారు. దీంతో మార్చి నెలలో 29.8 శాతం అధికంగా అమ్ముడైనట్టు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదికంటే ఎక్కువగా ఉన్నాయి. 2025 మార్చిలో 20.11 లక్షల కేసుల బీరు అమ్మగా.. ఈ ఏడాది మార్చిలో 26.11 లక్షల కేసులకు ఆ లెక్క పెరిగింది. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి బీరు అమ్మకాలు పెరుగుతుంటాయి. కానీ, ఈ ఏడాది మార్చి నుంచే ఏపీలో బీరు వినియోగం పెరిగింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో లిక్కర్ సేల్స్ ఎక్కువగా జరుగుతాయి. అయితే ఎండలు పెరగడంతో రెండు రాష్ట్రాల్లోనూ బీర్ల కొనుగోళ్లు పెరిగాయి. ముందు మందు ఈ కొనుగోళ్లు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
