Site icon NTV Telugu

Shreyas Iyer-BCCI: చూసుకోవాలి కదా శ్రేయాస్ భయ్యా.. బీసీసీఐ అన్నీ గమనిస్తుంది!

Shreyas Iyer Chahal

Shreyas Iyer Chahal

ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ గట్టెక్కింది. యుజ్వేంద్ర చహల్ 4 వికెట్లు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 72 పరుగులతో రాణించడంతో పంజాబ్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చెన్నైని ఓడించింది. ఈ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. అటు చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే కెప్టెన్‌గా, ఆటగాడిగా సక్సెస్ అయినప్పటికీ.. శ్రేయాస్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే పంత్, గిల్ భారీగా నష్టపోయారు. తాజాగా స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ శ్రేయాస్‌కు రూ.12 లక్షల రూపాయల ఫైన్ విధించింది.

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తొలిసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో రూ.12 లక్షలతో బీసీసీఐ సరిపెట్టింది. రెండోసారి ఇదే రిపీట్ అయితే రూ.24 లక్షల ఫైన్ పడుతుంది. ఐపీఎల్ నియమం 2.2 ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే కెప్టెన్‌కు జరిమానా పడుతుంది. కాగా పంజాబ్ తమ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది. పంజాబ్‌పై ఓడిన చెన్నై నెక్స్ట్ ఆర్సీబీతో తలపడుతుంది. ఈ సీజన్లో చెన్నై 10 మ్యాచుల్లో కేవలం రెండు మాత్రమే గెలిచింది. పటిష్ట టీమ్ లేకపోవడంతో ఈ సీజన్ ధోనీ సేనకు ఏ మాత్రం కలిసి రాలేదు.

Also Read: TDP vs Janasena: కూటమి నేతల మధ్య విభేదాలు.. చెక్ పెట్టే పనిలో పెద్దలు!

గతేడాది కేకేఆర్‌ని ఛాంపియన్‌గా నిలబెట్టినప్పటికీ ఆ జట్టు యాజమాన్యం ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయాస్‌ అయ్యర్‌ని విడుదల చేసింది. దీంతో శ్రేయాస్‌ను బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింతా రూ.26 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేశారు. శ్రేయాస్‌ వేలంలోకి రాగానే అతడిని కొనుగోలు చేయడానికి ప్రీతి ప్రణాళికలు రచించారు. వేలంలో మిగతా జట్లతో పోటీపడి మరీ కోట్లు కుమ్మరించారు. ప్రీతి సహా పంజాబ్ యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని శ్రేయాస్‌ నిలబెట్టుకున్నాడు. 10 మ్యాచుల్లో నాలుగు అర్ద సెంచరీలతో 360 పరుగులు చేశాడు. అంతేకాదు జట్టును తనదైన శైలిలో ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు పంజాబ్ 13 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరువైంది. మిగిలిన నాలుగు మ్యాచులో రెండు గెలిస్తే అధికారిక బెర్త్ దక్కుతుంది. ప్లేఆఫ్స్ లో ఇంకాస్త దూకుడుగా ఆడితే పంజాబ్ టైటిల్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version