Rohit: బిగ్ షాక్.. క్రికెటర్ రోహిత్‌పై రెండేళ్ల నిషేధం..

Download

Download

వయసు ధృవీకరణ పత్రాల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడిన బెంగాల్ లెగ్ స్పిన్నర్, భారత అండర్-19 జట్టు ఆటగాడు రోహిత్ యాదవ్‌పై బిసిసిఐ రెండేళ్ల కఠిన నిషేధం విధించింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) సీజన్ ముందు నిర్వహించిన ధృవీకరణ పత్రాల పరిశీలనలో ఈ మోసం బయటపడింది. జూలైలో శ్రీలంకలో పర్యటించిన భారత అండర్-19 జట్టులో భాగమైన 19 ఏళ్ల రోహిత్, త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు వన్డేలు, రెండు రోజుల మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. అయితే అతని సర్టిఫికెట్లలో మూడు వేర్వేరు పుట్టిన తేదీలు ఉండటంతో పాటు, వయసులో ఏకంగా 27 నెలల వ్యత్యాసం ఉన్నట్లు సీఏబీ గుర్తించింది. దీంతో అతడిని ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తక్షణమే తప్పించి, బిసిసిఐకి అనుబంధంగా ఉన్న అన్ని రాష్ట్ర సంఘాలకు సమాచారం అందించారు.

రోహిత్ యాదవ్‌తో పాటు వయసుల మార్పులకు పాల్పడిన మరో 64 మంది యువ క్రికెటర్లపై బెంగాల్ క్రికెట్ సంఘం తీవ్ర చర్యలు తీసుకుంది. ఈ నిషేధిత జాబితాలో 2022 అండర్-19 ప్రపంచకప్ విజేత, భారత జట్టు కీలక వేగవంతమైన బౌలర్ రవికుమార్ కూడా ఉండటం గమనార్హం. 2022లో బెంగాల్ సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేసిన ఎడమచేతి వాటం పేసర్ రవికుమార్ వయసులో ఏకంగా 40 నెలలకు పైగా వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. దీనివల్ల అతని అరంగేట్రం నుంచి 2025-26 సీజన్ వరకు ఉన్న వయసు సంబంధిత రికార్డులన్నీ చెల్లవని ప్రకటించారు.

భారత జూనియర్ క్రికెట్‌లో వయసు మోసాలు సుదీర్ఘకాలంగా పెద్ద సమస్యగా మారడంతో బిసిసిఐ కఠిన చర్యలు చేపడుతోంది. ఈ అక్రమాలను అరికట్టేందుకు బిసిసిఐ 2020లోనే స్వచ్ఛందంగా అసలు పుట్టిన తేదీలను వెల్లడించేందుకు ఒక వెసులుబాటు పథకాన్ని ప్రవేశపెట్టింది. నిబంధనలను ఉల్లంఘించి కావాలని తప్పు సమాచారం ఇచ్చే ఆటగాళ్లపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది. అండర్-19 ఆటగాళ్ల వయసు నిర్ధారణ ప్రక్రియలో భాగంగా జనన ధృవీకరణ పత్రంతో పాటు పాఠశాల లేదా కళాశాల విద్యా రికార్డులను సమర్పించడాన్ని బిసిసిఐ తప్పనిసరి చేసింది.