ప్రస్తుతం పశ్చిమాసియాలో చెలరేగుతున్న ఇరాన్ యుద్ధ జ్వాలలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడే బంగ్లాదేశ్ వంటి దేశాలు తీవ్రమైన ‘ఎనర్జీ క్రైసిస్’ను ఎదుర్కొంటున్నాయి. డాలర్ల నిల్వలు తగ్గడం, చమురు ధరలు పెరగడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యవసర పొదుపు మంత్రాన్ని పఠిస్తోంది.
బంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 95 శాతం ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. ఈ కష్టకాలంలో పొరుగు దేశం భారత్ వెన్నుదన్నుగా నిలిచింది. ఇప్పటికే బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు సుమారు 5 వేల టన్నుల డీజిల్ను భారత్ అదనంగా సరఫరా చేసింది. కేవలం బంగ్లాదేశే కాకుండా, శ్రీలంక, మాల్దీవులు కూడా ఇంధన సాయం కోసం భారత్ వైపు చూస్తుండటం గమనార్హం. ఇది దక్షిణాసియాలో భారత్ ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
విద్యుత్ ఆదా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు ఇకపై ఉదయం 9 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4 గంటలకే ముగియాలి. అంటే ఒక గంట ముందే పని ముగించుకుని ఇంటికి వెళ్లడం ద్వారా ఏసీలు, లైట్ల వినియోగం తగ్గుతుందని అంచనా. బ్యాంకులు కూడా మధ్యాహ్నం 3 గంటలకే కస్టమర్ సేవలను ఆపివేసి, 4 గంటల కల్లా మూతబడనున్నాయి.
Also Read:War Effect: యుద్ధం ఎఫెక్ట్.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్..
ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ప్రభుత్వం తన బడ్జెట్లో కోతలు విధించింది. ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన విద్యుత్, ఇంధన బడ్జెట్లో 30 శాతం తగ్గించాలని ఆదేశించింది. అలాగే.. విలాసవంతమైన ఖర్చులకు చెక్ పెడుతూ కొత్తగా కార్లు, విమానాలు లేదా నౌకల కొనుగోలును పూర్తిగా నిషేధించింది. వేడుకల్లో రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణపై కూడా ఆంక్షలు విధించారు.
మార్కెట్లపై ఆంక్షలు..
సాధారణ ప్రజల జీవనశైలిలో కూడా మార్పులు వచ్చేలా షాపింగ్ మాల్స్, ఇతర మార్కెట్లను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఫుడ్ సెంటర్లు, మందుల షాపులు, అత్యవసర సేవలకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. సుమారు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్, తన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకే ఈ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి సుమారు 2.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోరుతున్న తరుణంలో.. భారత్ అందిస్తున్న డీజిల్ సరఫరా ఆ దేశానికి పెద్ద ఊరటనిస్తోంది.