Bandi Sanjay: బండి సంజయ్‌పై టెన్త్ పేపర్ లీక్ కేసును రద్దు చేసిన హైకోర్టు.. కేంద్ర మంత్రి హర్షం..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: బండి సంజయ్‌పై టెన్త్ పేపర్ లీక్ కేసు నమోదైన విషయం తెలిసిందే.. ఈ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును తొలగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ.. “టెన్త్ పేపర్ లీక్ కేసును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం.. చేయని తప్పుకు నన్ను జైలుకు పంపారు.. మానవత్వం మరిచి నాపట్ల, బీజేపీ కార్యకర్తలపట్ల క్రూరంగా వ్యవహరించారు.. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నన్ను రోడ్లపై తిప్పుతూ ఏదో చేద్దామనుకున్నారు.. కార్యకర్తల ధాటికి తట్టుకోలేక జైలుకు పంపారు.. టెన్త్ హిందీ పేపర్ ను ఎవరైనా లీక్ చేస్తారా? అంటూ జనం నవ్వుకున్నారు.. ఇన్ని కేసుల విషయంలో కోర్టుల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నా… అయినా భరిస్తున్నా.. కేసీఆర్ ప్రభుత్వ మెడలు వంచిన పార్టీ బీజేపీ అనే త్రుప్తి నాకు మిగిలింది.. ఈ పాపం ఊరికే పోదు…కక్ష సాధింపు చర్యలకు ఫలితం ఉంటుంది.. నాపై మోపిన కేసులన్నీ అక్రమమైనవని ఈ కోర్టు తీర్పు ద్వారా నిరూపితమైంది.. ప్రజాకంటకంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెట్టారు. ఆరోజు నాకు అమిత్ షా, జేపీ నడ్డా అండగా నిలిచారు.. ఆరోజు నాకు అండగా ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వానికి, కార్యకర్తలకు ధన్యవాదాలు..” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Ravi Babu : ఆ పోస్టర్ చూసి నన్ను తిట్టారు.. రవిబాబు కామెంట్స్

కేసు ఏంటి..?
2023లో బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కేసు నమోదైంది. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని కమలాపూర్‌లో హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సంజయ్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. సంజయ్ ప్రోద్బలంతోనే మిగిలిన నిందితులు ప్రశ్నపత్రాన్ని పరీక్షా కేంద్రం నుంచి దొంగతనంగా సేకరించి వాట్సప్‌లో వైరల్‌ చేశారని ఆయనపై అభియోగాలు మోపారు. దీంతో సంజయ్‌పై 120 (బి), 420, 447, 505 (1) (బి) ఐపీసీ, 4 (ఎ), 6, రెడ్‌విత్‌ 8 ఆఫ్‌ టీఎస్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ యాక్ట్‌-1997, సెక్షన్‌ 66-డి ఐటీ యాక్ట్‌-2008 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అనేక నాటకీయ పరిణామాల హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ముందు సంజయ్‌ను హాజరు పరిచారు. అప్పట్లో ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి రాపోలు అనిత ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం సంజయ్‌ను రిమాండ్ కోసం కరీంనగర్ జైలుకు తరలించారు.