Balochistan: ముక్కలైన పాకిస్థాన్? స్వాతంత్ర్యం ప్రకటించుకున్న బలూచిస్థాన్.. 11 భాషల్లో లౌకిక రాజ్యాంగం!

Balochistan Independence

Balochistan Independence

Balochistan: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఇప్పటికే ఆందోళనలతో తీవ్ర కలకలం రేగుతుండగా, ఇప్పుడు పాకిస్థాన్‌లోనే అత్యంత పెద్ద, ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న ‘బలూచిస్థాన్‌’ ప్రాంతం తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటించి పాక్‌కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్‌’ ఆగస్టు 11ను బలూచిస్థాన్‌ స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలంతా దీనిని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. అంతేకాకుండా, అంతర్జాతీయ సమాజం బలూచిస్థాన్‌‌ను ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశంగా గుర్తించాలని డిమాండ్ చేసింది. కొద్ది వారాల క్రితమే ఈ బలూచ్ సమూహం పాకిస్థాన్ నుంచి తమకు స్వాతంత్ర్యం లభించినట్లు ప్రకటించుకుంది. పాకిస్థాన్ దీనిని అంగీకరించకపోయినా, ప్రపంచవ్యాప్తంగా బలూచిస్థాన్‌ పాక్‌లో భాగంగానే భావించబడుతున్నా.. బలూచ్ ప్రజలు మాత్రం తాము ఎన్నడూ పాకిస్థాన్‌లో భాగం కాదని స్పష్టం చేస్తున్నారు. బలూచ్ ఉద్యమ నాయకుడు మీర్ యార్ బలోచ్ మాట్లాడుతూ.. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలంతా తమ ఇళ్లు, దుకాణాలు, విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలపై స్వతంత్ర బలూచిస్థాన్‌ జెండాను ఎగురవేయాలని కోరారు.

ఆగస్టు 11 నే ఎందుకు ఎంచుకున్నారు?

1947 ఆగస్టు 11న బ్రిటిష్ పాలన ముగియడానికి సరిగ్గా ముందు, అప్పటి ‘కలాత్’ (బలూచిస్థాన్‌ ప్రాంతం) సంస్థానం తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆ సమయంలో పాకిస్థాన్ కూడా ఈ స్వాతంత్ర్యాన్ని అంగీకరించిందని, అయితే ఆ తర్వాత మోసపూరితంగా సైనిక బలగాలతో బలూచిస్థాన్‌‌ను తమ దేశంలో కలిపేసుకుందని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్‌ పేర్కొంది. నాటి ఈ స్వాతంత్ర్య ప్రకటన వార్తను ది న్యూయార్క్ టైమ్స్, ఆల్ ఇండియా రేడియో కూడా ప్రసారం చేశాయని, ఆ చారిత్రాత్మక నేపథ్యం ఆధారంగానే ప్రతీ ఏటా ఆగస్టు 11ను స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 8, 2026 న బలూచిస్థాన్‌ నాయకుడు మీర్ యార్ బలోచ్ తమ మధ్యంతర రాజ్యాంగాన్ని (అంతరిమ్ కాన్‌స్టిట్యూషన్) అధికారికంగా విడుదల చేశారు. పాకిస్థాన్ సైన్యం చేతిలో దారుణంగా చిత్రహింసలకు గురై, ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది అమరుల రక్తంతో ఈ రాజ్యాంగం లిఖించబడిందని ఆయన తెలిపారు.

ఈ రాజ్యాంగం బలూచిస్థాన్‌ ఒక లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశమని చాటిచెబుతోంది. ఈ రాజ్యాంగంలోని మొదటి లైన్ మతాన్ని, రాజకీయాన్ని వేరు చేస్తుంది.
పాకిస్థాన్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతుంటే, బలూచిస్థాన్‌ రాజ్యాంగం హిందూ, సిక్కు, క్రైస్తవ సమాజాలకు పూర్తి భద్రత, సమానత్వాన్ని గ్యారెంటీ ఇస్తుంది. ఈ చార్టర్‌ను ప్రపంచవ్యాప్తంగా 11 ముఖ్యమైన భాషల్లోకి అనువదించారు. ఇందులో హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషలు కూడా ఉన్నాయి.

పాకిస్థాన్‌పై తీవ్ర ఆరోపణలు:

పాకిస్థాన్ ఉనికిలో ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి సాధ్యం కావని బలూచ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. విభాజన తర్వాత ఈ ప్రాంతంలో ఉగ్రవాదం, ఆర్థిక అస్థిరత పెరగడానికి పాక్ విధానాలే కారణమని ఆరోపించారు. కాశ్మీర్ వివాదం, 1948 మార్చిలో బలూచిస్థాన్‌‌పై జరిగిన సైనిక చర్య, 1971లో తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) విడిపోవడం, సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం, 1998 చాగాయ్ అణు పరీక్షలు వంటి ఘట్టాలన్నీ ప్రాంతీయ అస్థిరతకు దారితీశాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఆగస్టు 14న, భారత్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటాయి. ఐక్యరాజ్యసమితి లేదా ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇప్పటివరకు బలూచిస్థాన్‌‌ను ప్రత్యేక దేశంగా అధికారికంగా గుర్తించనప్పటికీ, ఆగస్టు 11ను స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించి బలూచ్ నాయకులు తమ పోరాటాన్ని అంతర్జాతీయ వేదికపైకి బలంగా తీసుకెళ్లారు.