MLC Elections: నామినేషన్లు దాఖలు చేసిన బల్మూరి వెంకట్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ గురువారం అసెంబ్లీలో నామినేషన్లు దాఖలు చేశారు. వారి వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి దీపదాస్‌ మున్షీ తదితరులున్నారు.

శాసనమండలికి ఉప ఎన్నికలు జనవరి 29న జరగనున్నాయి. గత ఏడాది డిసెంబరు 9న ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాజీనామా చేయడంతో శాసనమండలిలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. అదే రోజు ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అసెంబ్లీలో వారి బలాన్ని పరిశీలిస్తే మండలిలోని రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. శాసనమండలిలో బీఆర్‌ఎస్‌కు 27 సీట్లు ఉండగా, కాంగ్రెస్‌కు రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి.

అంతకుముందు గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పరామర్శించారు. తమ్మినేని వీరభద్రం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా సీపీఎం నేతను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.