NTV Telugu Site icon

Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. జ్యుడీషియల్ కస్టడీకి ముగ్గురు రైల్వే అధికారులు

Train Accident

Train Accident

Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదంలో ముగ్గురు నిందితులుగా ఉన్న రైల్వే అధికారులను సీబీఐ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత భువనేశ్వర్‌లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. రైల్వే శాఖ సస్పెన్షన్‌లో ఉంచిన సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగ్నల్‌) అరుణ్‌కుమార్‌ మహంత, సెక్షన్‌ ఇంజినీర్‌ మహ్మద్‌ అమీర్‌ఖాన్‌, టెక్నీషియన్‌ పప్పుకుమార్‌ రిమాండ్‌ గడువు ముగియడంతో శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. నిందితులను జులై 7న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానం జులై 7న ఐదు రోజుల రిమాండ్‌ను విధించింది. ఆ తర్వాత, జులై 11న దర్యాప్తు సంస్థ అభ్యర్థన మేరకు కోర్టు రిమాండ్ వ్యవధిని మరో నాలుగు రోజులు పొడిగించింది. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, కేసు తదుపరి విచారణను జూలై 27న కోర్టు వాయిదా వేసింది.

Also Read: Viral News: పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. తెరిచి చూసిన రైతు షాక్!

ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 304, 201, రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కేసు నమోదు చేయబడింది. ఈ కేసుపై సీబీఐ ఇంకా తన నివేదికను సమర్పించనుండగా, సిగ్నలింగ్ సర్క్యూట్ మార్పులో లాప్స్ కారణంగా ప్రమాదం జరిగిందని సౌత్ ఈస్టర్న్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) విచారణ నివేదిక పేర్కొంది.

జూన్ 2న రెండు ప్యాసింజర్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదంలో 293 మంది మరణించారు. 1,200 మందికి పైగా గాయపడ్డారు. రద్దీగా ఉండే మార్గంలో గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాదానికి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించినట్లు చెప్పిన వారాల తర్వాత అరెస్టు జరిగింది. రైళ్ల ఉనికిని గుర్తించే ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను ట్యాంపరింగ్ చేయడం వల్ల ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.