కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ పూర్తిగా మూసివేయడం జరిగింది. దీనితో ఓటీటీ ప్లాట్ఫారమ్ల వినియోగం బాగా పెరిగింది. అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్ సహా అనేక ఓటీటీ ప్లాట్ఫారమ్లకు డిమాండ్ బాగా పెరిగింది . అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.సాధారణంగా సెన్సార్ పూర్తయిన తర్వాతే థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తారు.సినిమాలో ఏదైనా అదనపు సన్నివేశం పెడితే సెన్సార్ బోర్డు ముందు ఉంచిన తర్వాతే సిల్వర్ స్క్రీన్పైకి అనుమతిస్తారు. అయితే, ఓటీటీ ప్లాట్ఫారమ్లకు అలాంటి పరిమితి లేదు. అక్కడ ప్రసారమయ్యే సినిమాలకు, వెబ్ సిరీస్ లకు ఎలాంటి సెన్సార్ ప్రక్రియ అవసరం లేదు. అన్ కట్, అన్ ఎడిటెడ్ వెర్షన్స్ అంటూ సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పటి నుంచి ఓటీటీ మూవీస్ మరియు సిరీస్ లకు సెన్సార్ ఉండనుంది.
ఓటీటీ లు మరియు సిరీస్లోని అసభ్యకర సన్నివేశాలు, డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం ఇకపై డిజిటల్ స్ట్రీమింగ్ లకు సెన్సార్ నిబంధనలు విధించింది. ముఖ్యంగా ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్కు పలు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీంతో సెన్సార్ చేయని వెర్షన్ను ప్రసారం చేయవద్దని సెన్సార్ బోర్డు నెట్ఫ్లిక్స్ను ఆదేశించింది. నెట్ ఫ్లిక్స్ ఈ సూచనను అనుసరించడం ప్రారంభించింది. అయితే ఇటీవల స్ట్రీమింగ్ కు వచ్చిన ‘భీద్’ అనే సిరీస్ లో ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర రాజకీయ నేతల ప్రస్తావన ఉంది. అయితే ఇప్పుడీ సీన్లను పూర్తిగా కత్తిరించేశారు.అలాగే ‘లియో’ మరియు ‘ఓఎంజీ 2’ లో కట్ పార్ట్లను జోడించి ప్రసారం చేశారు. ఇప్పుడు, కొత్త నోటీసు ప్రకారం, నెట్ఫ్లిక్స్ సెన్సార్ చేసిన వెర్షన్ను మాత్రమే స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించింది.. సెన్సార్ బోర్డ్ సూచనల మేరకు నెట్ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయంతో ఓటీటీ ప్రేక్షకులు నిరాశ చెందారు. అయితే ఇటీవల విడుదల అయిన ‘యానిమల్’ సినిమా పరిస్థితి ఏంటని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే యానిమల్ మూవీ మొత్తం 4 గంటలకు పైగా ఉంది. అయితే థియేటర్ వెర్షన్ లో కేవలం 3 గంటల 21నిముషాలు మాత్రమే ఉంది. దీంతో ఓటీటీలోనైనా ఫుల్ వెర్షన్ను చూడొచ్చన్న అభిమానులకు నెట్ఫ్లిక్స్ భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.