Babar Azam: బాబర్ ఆజామ్, విరాట్ కోహ్లీ గురించి చర్చలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. ప్రపంచ టీ20 క్రికెట్లో ఒకరికి మించి రికార్డులు బద్దలు గొడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ మరో మైలు రాయిని సాధించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) క్వాలిఫైయర్ మ్యాచ్లో బాబర్ ఆజం విశ్వరూపం ప్రదర్శించాడు. ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన కీలక పోరులో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన బాబర్.. ఒత్తిడిలోనూ అద్భుత సెంచరీతో పెషావర్ జల్మీని ఫైనల్కు చేర్చాడు. 59 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేశాడు. కరాచీలోని కష్టతరమైన పిచ్పై బాబర్ మెరుపులు మెరిపించడంతో జల్మీ జట్టు 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇస్లామాబాద్ 151 పరుగులకే కుప్పకూలడంతో పెషావర్ ఘనవిజయం సాధించింది. బాబర్కు తోడుగా మహమ్మద్ హారిస్, కుశాల్ మెండిస్, ఆరోన్ హార్డీ వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ఇక, ఈ సెంచరీతో బాబర్ ఆజం టీ20 క్రికెట్లో పలు రికార్డులను తిరగరాశాడు. ఒక కెప్టెన్గా టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు (9) చేసిన ఆటగాడిగా ఫాఫ్ డుప్లెసిస్ (8) రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో మైఖేల్ క్లింగర్ (7), విరాట్ కోహ్లీ (5), జేమ్స్ విన్స్ (5) బాబర్ కంటే వెనుకబడి ఉన్నారు. అలాగే పీఎస్ఎల్ చరిత్రలో ఇది బాబర్కు నాలుగో సెంచరీ కాగా.. అత్యధిక సెంచరీలు చేసిన ఉస్మాన్ ఖాన్ రికార్డును అతను సమం చేశాడు. ఈ సీజన్లో బాబర్ ఫామ్ చూస్తుంటే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. ఇప్పటివరకు 588 పరుగులు చేసిన అతను, ఒకే పీఎస్ఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఫఖర్ జమాన్ (2022) రికార్డును సైతం సమం చేశాడు. అంతేకాకుండా, ఒకే దేశంలో (పాకిస్థాన్లో) 8 టీ20 సెంచరీలు సాధించి.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మల పేరిట ఉన్న రికార్డును సైతం అందుకున్నాడు. తన ఫామ్ గురించి బాబర్ మాట్లాడుతూ.. “నేను నా పాత ఫామ్ను తిరిగి పొందుతున్నట్లు అనిపిస్తోంది. కష్టమైన విషయాలను సరళంగా ఆలోచిస్తూ, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడుతున్నాను. పీఎస్ఎల్ కంటే ముందు నేను చేసిన కష్టమే ఇప్పుడు ఫలితాన్నిస్తోంది” అని ధీమా వ్యక్తం చేశాడు.
