ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నీలో భాగంగా ఆగస్టు 2, ఆదివారం నాడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ సమరం జరగనుంది. ఇండియన్ రాయల్స్, పాకిస్థాన్ పాంథర్స్ జట్ల మధ్య జరిగే ఈ ఆరో మ్యాచ్ జాంబియాలోని లుసాకా నగరంలో ఉన్న లోటస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ హై-వోల్టేజ్ పోరు సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ను టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానళ్లలో, అలాగే డిజిటల్ ప్లాట్ఫారమ్లో ఫ్యాన్కోడ్ యాప్, వెబ్సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.
ఇండియన్ రాయల్స్ జట్టు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో దినేష్ కార్తీక్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, అంబటి రాయుడు, రిషి ధావన్, స్టువర్ట్ బిన్ని వంటి నక్షత్ర స్థాయి ఆటగాళ్లతో ఎంతో బలంగా మైదానంలోకి దిగుతోంది. తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ టైగర్స్ జట్టును 19 పరుగుల తేడాతో ఓడించి ఇండియన్ రాయల్స్ విజయంతో బోణీ కొట్టింది. మరోవైపు.. మహమ్మద్ హఫీజ్ సారథ్యంలో ఉమర్ అక్మల్, షోయబ్ మాలిక్, వహాబ్ రియాజ్, సోహైల్ తన్వీర్, సైద్ అజ్మల్ వంటి వెటరన్ ఆటగాళ్లతో కూడిన పాకిస్థాన్ పాంథర్స్ జట్టు తమ మొదటి మ్యాచ్లో ఏషియన్ స్టార్స్ చేతిలో 85 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.
దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి టోర్నీలో తిరిగి పుంజుకోవాలని పాకిస్థాన్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ఆసియా ఖండానికి చెందిన రిటైర్డ్ దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న ఎషియన్ లెజెండ్స్ లీగ్ సీజన్-2 జూలై 30న ప్రారంభమై ఆగస్టు 10న ముగియనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 19 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. గతేడాది జరిగిన తొలి సీజన్లో భారత్ ఫైనల్ చేరుకుని రన్నరప్గా నిలిచింది. మైదానంలో మళ్లీ పాత రోజులను గుర్తుచేస్తూ తలపడనున్న భారత్-పాకిస్థాన్ జట్ల పోరు ఈ లీగ్కే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండటంతో ఇరు దేశాల అభిమానులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

