Ashes Test in India: ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన యాషెస్ (Ashes) సిరీస్కు సంబంధించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్లోని ఒక మ్యాచ్ను భారత్లో నిర్వహించే అవకాశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (CA) పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) టాడ్ గ్రీన్బర్గ్ వెల్లడించారు.
ప్రముఖ పోడ్కాస్ట్లో మాట్లాడిన టాడ్ గ్రీన్బర్గ్.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB), భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. భారత మార్కెట్, టెస్టు క్రికెట్కు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో యాషెస్ టెస్టును భారత్లో నిర్వహించే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని చెప్పారు. అయితే, ప్రస్తుతం అలాంటి ప్రణాళిక ఏదీ లేదని.. కానీ భవిష్యత్తులో దీనిపై ఆలోచించే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగే టెస్టు క్రికెట్కు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో టెస్టు క్రికెట్ ఆదరణ తగ్గుతున్నా.. ఈ మూడు దేశాల్లో మాత్రం అభిమానుల ఆసక్తి బలంగా కొనసాగుతోందని చెప్పారు. అందుకే టెస్టు క్రికెట్ను మరింత బలోపేతం చేయడానికి కొత్త అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
యాషెస్ ప్రపంచంలోనే అత్యంత పురాతన క్రికెట్ ప్రత్యర్థిత్వాల్లో ఒకటి. 1882లో ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఓడిపోవడంతో ప్రచురితమైన ‘మాక్ ఒబిచ్యువరీ’ (Mock Obituary) తర్వాత ఈ సిరీస్కు “యాషెస్” అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సిరీస్ జరుగుతోంది. భవిష్యత్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం నాలుగేళ్లకు ఒకసారి ఇంగ్లండ్, మరో నాలుగేళ్లకు ఒకసారి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తూ ఈ సిరీస్ను నిర్వహిస్తున్నాయి.
క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఇప్పటికే మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బిగ్ బాష్ లీగ్ (BBL) 2026-27 సీజన్ తొలి మ్యాచ్ను చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 12న మెల్బోర్న్ రెనిగేడ్స్-పెర్త్ స్కోర్చర్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా వెలుపల BBL మ్యాచ్ నిర్వహించడం ఇదే తొలిసారి.
ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఇప్పటికే యాషెస్ 2027 షెడ్యూల్ను ప్రకటించింది. ఈ సిరీస్ జూన్ 18 నుంచి ఆగస్టు 2, 2027 వరకు ఇంగ్లండ్లో జరగనుంది. ట్రెంట్ బ్రిడ్జ్, లార్డ్స్, ఎడ్జ్బాస్టన్, సౌతాంప్టన్, ది ఓవల్ వేదికలుగా ఎంపికయ్యాయి. అయితే 2027 యాషెస్ సిరీస్ ఇంగ్లండ్లోనే జరగనున్న నేపథ్యంలో.. భారత్లో యాషెస్ టెస్టు నిర్వహించే అవకాశం 2029-30 సైకిల్కు ముందు ఉండదని తెలుస్తోంది. అయినప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించడం ప్రపంచ క్రికెట్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. భారత్లో యాషెస్ మ్యాచ్ జరిగితే అది టెస్టు క్రికెట్ చరిత్రలో మరో కొత్త అధ్యాయంగా నిలువనుంది .

