భాగ్యనగరం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా సమరానికి వేదిక కాబోతోంది. ప్రపంచ అత్యుత్తమ ఆర్చర్లు తమ విలువిద్య నైపుణ్యాలను ప్రదర్శించే ‘ఆర్చరీ ప్రీమియర్ లీగ్’ (APL) సీజన్-2కు హైదరాబాద్ సిద్ధమైంది. అక్టోబర్ 8 నుండి 18 వరకు నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో 11 రోజుల పాటు సాగే ఈ మెగా టోర్నీలో 6 ఫ్రాంచైజీ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAI) చొరవతో, తెలంగాణ ప్రభుత్వ సంపూర్ణ మద్దతుతో ఈ లీగ్ రూపుదిద్దుకుంది. గత ఏడాది న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసిన తొలి సీజన్ స్పూర్తితో ఇప్పుడు రెండో సీజన్ను మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఒలింపిక్స్లో భారతదేశానికి ఆర్చరీ విభాగంలో పతకాల అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 2025లో ఈ లీగ్ ప్రారంభమైంది. ఈ సీజన్లో ఒలింపిక్ ఛాంపియన్లు, వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారులతో పాటు భారత్ తరఫున ప్రముఖ ఆర్చర్లు, మాజీ వరల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి, ఫోర్-టైమ్ ఒలింపియన్ అతాను దాస్, 2023 కాంపౌండ్ వరల్డ్ ఛాంపియన్ గోల్డ్ మెడలిస్ట్ ఓజస్ డియోతాలే, టాప్ ఆర్చర్లు జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మ, ఒలింపియన్ అంకిత భకత్ వంటి దిగ్గజాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ లీగ్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చరిత్రలో మొదటిసారిగా రికర్వ్, కాంపౌండ్ విభాగాల పురుష, మహిళా ఆర్చర్లు అందరూ కలిసి ఒకేచోట పోటీపడనున్నారు. అంతేకాకుండా.. ఆటలో మరింత ఉత్కంఠను పెంచేందుకు సాధారణ ఒలింపిక్స్లో ఉండే 20 సెకన్ల సమయాన్ని ఇక్కడ 15 సెకన్ల షాట్ క్లాక్గా మార్చారు. దీనివల్ల క్రీడాకారులు అత్యంత వేగంగా, ఒత్తిడిని జయించి బాణం గురిపెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఏకైక ఫ్రాంచైజీ ఆధారిత ఆర్చరీ లీగ్ ఇదే కావడం విశేషం. దీనికి వరల్డ్ ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఆసియా సంస్థల పూర్తి మద్దతు ఉంది. అక్టోబర్లో హైదరాబాద్ వేదికగా జరగబోయే ఈ విలువిద్యల పండగ క్రీడాభిమానులకు సరికొత్త అనుభూతిని ఇస్తూ కనువిందు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

