వేసవి భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్తను అందించింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం చల్లబడనుందని అంచనా వేసింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణపై ప్రస్తుతం ఉన్న వాతావరణ ద్రోణి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరఠ్వాడా నుంచి కర్ణాటక తీరం వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ద్రోణి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. దీని ఫలితంగా శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే.. ఈ ఉపశమనం తాత్కాలికమేనని, వచ్చే వారం నుంచి ఎండల తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉందని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికం కావచ్చని అధికారులు వెల్లడించారు.
Also Read:Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
ఆంధ్రప్రదేశ్లో కూడా వాతావరణ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు వర్ష సూచన ఉంది. శుక్రవారం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ.. శని, ఆదివారాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
కోస్తాంధ్రలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. రాయలసీమలో మాత్రం వచ్చే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మూడు రోజుల తర్వాత ఎండల తీవ్రత పెరిగే సూచనలు ఉన్నాయి.
రైతులకు, ప్రజలకు సూచనలు
అకాల వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరబోసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండల తీవ్రత పెరిగే సమయంలో మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య బయటకు రాకుండా ఉండటం శ్రేయస్కరం.
