విశాఖపట్నం నగరాన్ని ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తన అత్యాధునిక ‘గ్రీన్ ఐటీ క్యాంపస్’ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం నగరంలోని అత్యంత విలువైన ఎండాడ హిల్స్ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అత్యల్ప ధరకే భూమి కేటాయింపు
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘లిఫ్ట్ పాలసీ’ (LIFT Policy)లో భాగంగా.. ఈ 20 ఎకరాల భూమిని కేవలం ఎకరం 99 పైసలకే (లీజు ప్రాతిపదికన) ఇన్ఫోసిస్కు అప్పగించారు. భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇన్ఫోసిస్ సంస్థ ఈ క్యాంపస్ కోసం సుమారు రూ. 750 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టనుంది. దీనికి ప్రతిగా ప్రభుత్వం ఏపీఐఐసీ (APIIC) ద్వారా రూ. 79 కోట్లతో రహదారులు, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పించనుంది. పర్యావరణానికి హాని కలగకుండా నిర్మించే ఈ క్యాంపస్కు ప్రభుత్వం 100 శాతం గ్రీన్ ఎనర్జీ (పునరుత్పాదక శక్తి)ని సరఫరా చేయాలని నిర్ణయించింది.
నిరుద్యోగులకు వరం..
ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే ఆరేళ్ల కాలంలో విశాఖ యువతకు సుమారు 7,000 కొత్త ఐటీ ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానికంగా ఉన్న ప్రతిభావంతులైన యువతకు సొంత ఊరిలోనే అంతర్జాతీయ స్థాయి సంస్థలో పనిచేసే అవకాశం దక్కుతుంది.
విశాఖ భవిష్యత్తు..
ఇన్ఫోసిస్ వంటి గ్లోబల్ కంపెనీ రాకతో విశాఖ ఐటీ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. ఇది ఇతర దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా విశాఖ వైపు చూసేలా చేస్తుంది. కేవలం పర్యాటక రంగమే కాకుండా.. రాబోయే రోజుల్లో విశాఖ ‘గ్లోబల్ ఐటీ హబ్’గా ఎదుగుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
