ఏపీలో సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఫ్యామిలీ కార్డు విధానం ప్రవేశపెట్టే దిశగా చర్యలు ప్రారంభించింది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపుగా ఈ కార్డు ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్ తెలిపారు. ఈ కార్డు ద్వారా ప్రభుత్వంలోని అన్ని సంక్షేమ పథకాల లబ్ధిని ఒకే వేదికపై అందించేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు గ్రామాలు, పట్టణాల్లో క్షేత్రస్థాయి సర్వేలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.
భవిష్యత్తులో అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను కూడా ఫ్యామిలీ కార్డుతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఒకే కార్డు ఆధారంగా కుటుంబానికి అందే పథకాల వివరాలు స్పష్టంగా నమోదు అవుతాయి. కలెక్టర్ల సదస్సులో ‘జీరో పావర్టీ’ లక్ష్యంపై ఆయన ప్రజెంటేషన్ ఇస్తూ.. మార్గదర్శి , బంగారు కుటుంబం పథకాల అమలు పురోగతిని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 20 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానం చేసినట్లు తెలిపారు.
Also Read:GHMC: గుడ్న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట..
గ్రామస్థాయిలో ‘బంగారుమిత్ర’లను నియమించి పథక అమలును పర్యవేక్షించే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోటిన్నరకు పైగా కుటుంబాలు బీపీఎల్ వర్గంలో ఉన్నప్పటికీ.. వచ్చే రెండు సంవత్సరాల్లో కనీసం ఐదు లక్షల కుటుంబాలు దారిద్ర్య రేఖకు పైకి రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇక ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లా స్థాయిలో అవసరాలను గుర్తించి జిల్లా నైపుణ్య ప్రణాళికలు రూపొందించాలని నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ సూచించారు. శాఖను పునర్వ్యవస్థీకరించి జిల్లాల్లో ఉపాధి, నైపుణ్య అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తున్నామని తెలిపారు. ‘నైపుణ్యం’ పోర్టల్ ద్వారా లక్ష మందికి స్కిల్ అసెస్మెంట్ జరుగుతోందని.. ఈ నెలాఖరుకు అది పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
Also Read:IOCL: సంక్షోభం వేల భారీ శుభవార్త.. పుష్కలంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు.. వెల్లడించిన ఆయిల్ కంపెనీ..
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 1.46 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులపై ప్రత్యేక సర్వే జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిర్మాణ రంగంలో ఉన్నప్పటికీ.. వారిలో కేవలం నాలుగు శాతం మంది మాత్రమే అధికారిక శిక్షణ పొందినట్లు గుర్తించారు. ఈ రంగంలో 113 రకాల పనులకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమని, పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జూన్ నుంచి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతిలో ఐదు ఎకరాల్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ.. ‘కౌశలం’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని స్కిల్డ్ , అన్స్కిల్డ్ మానవ వనరులపై సమగ్ర సర్వే కొనసాగుతోందని తెలిపారు. దీని ఆధారంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులను రాష్ట్రంలోనే తయారు చేయడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
