Excise Policy: ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీ.. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు..

Liquor Shop

Liquor Shop

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించి నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చింది. రాష్ట్రంలో పారదర్శకతను పెంచేందుకు, అక్రమాలను అరికట్టేందుకు ఈ పాలసీలో అనేక కీలక నిర్ణయాలను అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 3,736 మద్యం షాపుల లైసెన్సులన్నింటినీ ఏడాది పాటు రెన్యువల్ చేయనున్నారు. ఈ లైసెన్స్ పొడిగింపు 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. ఒకవేళ ఎవరైనా రెన్యువల్ చేసుకోకపోతే, ఆ మద్యం షాపులను లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తారు. లాటరీ లేదా దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్‌రిఫండబుల్ ఫీజును నిర్ణయించారు.

ఎంఆర్‌పీ ఉల్లంఘనలు, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయాలు, బ్రాండ్ మిక్సింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. తొలి తప్పిదానికి రూ.10 లక్షల భారీ జరిమానా విధిస్తారు, రెండోసారి తప్పు పునరావృతమైతే లైసెన్స్ రద్దు చేస్తారు. పారదర్శకత కోసం ప్రతి మద్యం షాపులో 4 సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి చేశారు. వీటి ద్వారా 24 గంటలూ పర్యవేక్షణ ఉంటుంది. ఏఐ టెక్నాలజీ ద్వారా ఉల్లంఘనలను గుర్తిస్తారు. మద్యం విక్రయాలపై ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ట్రాక్‌ & ట్రేస్ విధానాన్ని ప్రవేశపెట్టారు.

ఉత్పత్తి దశ నుంచి రిటైల్ విక్రయం వరకు ప్రతి దశను డిజిటల్‌గా రికార్డు చేస్తారు. ప్రతి మద్యం షాపులో ఎంఆర్‌పీ ధరల ప్రదర్శన తప్పనిసరి. వినియోగదారుల ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా 14405 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే క్యాష్‌తో పాటు డిజిటల్ పేమెంట్లను తప్పనిసరిగా స్వీకరించాలి. వినియోగదారుడి ఎంపిక మేరకు చెల్లింపులు చేసే అవకాశం కల్పించారు. అక్రమ మద్యం విక్రయాలపై కఠిన నిఘా ఉంచారు. ఇటువంటి కేసుల్లో తొలి తప్పిదానికి రూ.5 లక్షల జరిమానా, రెండోసారి లైసెన్స్ రద్దు చేస్తారు. అక్రమ , కల్తీ మద్యం సమాచారం అందించేవారికి ప్రోత్సాహకాలు ఉంటాయి. సీజ్‌కు దారితీసే కచ్చితమైన సమాచారం ఇస్తే గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు బహుమతి అందజేస్తారు.