NTV Telugu Site icon

Atchannaidu vs Botsa: శాసనమండలిలో అచ్చెన్నాయుడు, బొత్స మధ్య మాటల యుద్ధం!

Atchannaidu Vs Botsa

Atchannaidu Vs Botsa

శాసనమండలిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శాసనమండలి వివక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని, గతంలో కట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగనన్న కాలనీలు అన్నారని, దాని గురించి ఏమీ మాట్లాడాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. 2014-19 మధ్య ఇళ్లు కట్టిన వారికి తమ ప్రభుత్వ హయంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడటం అవాస్తవం అని బొత్స ఫైర్ అయ్యారు. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చామని, అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదని బదులిచ్చారు. రాజకీయ కక్ష్యలతో ఇవ్వలేదని చెప్పటం సరికాదని అచ్చెన్నాయుడుతో బొత్స అన్నారు.

శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ‘2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదు. కట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. జగనన్న కాలనీలు అన్నారు.. దాని గురించి నేను ఏమీ మాట్లాడాల్సిన పనిలేదు.. ఏం జరిగిందో అందరికీ తెలుసు. కేంద్రం డబ్బులతోనే కథ నడిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మేము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి’ అని అన్నారు.

బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ‘2014-19 మధ్య ఇళ్లు కట్టిన వారికి మా ప్రభుత్వ హయంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడటం అవాస్తవం. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చాం. అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదు. కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ కక్ష్యలతో ఇవ్వలేదని చెప్పటం సరికాదు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చింది. మా పార్టీ వారికే పనులు, పథకాలు ఇవ్వాలని అప్పటి మా సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు పథకాలపై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలి. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన భాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా. కేవలం కార్యకర్తలకు ఇవ్వమనటానికి ఇదేమైనా వాళ్ళ సొంత ఆస్తా. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చాం’ అని బదులిచ్చారు.