ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నాణ్యమైన బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ.52కే అందించనుండగా, బీపీటీ రా బియ్యాన్ని కిలో రూ.50 చొప్పున ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ఈ ప్రత్యేక విక్రయాల కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రజలకు సులభంగా బియ్యం లభించేలా 130 రైతు బజార్లతో పాటు దాదాపు 500 రైస్ మిల్లు కౌంటర్లలో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ పటమట రైతు బజారులో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ బియ్యం విక్రయ కేంద్రాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. అక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కౌంటర్లలోనూ అమ్మకాలు ఒకేసారి ప్రారంభమవుతాయి.
బియ్యం అక్రమ రవాణా కాకుండా, అర్హులైన సామాన్యులందరికీ ఈ సదుపాయం అందేలా ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేస్తోంది. ధరల నియంత్రణ దిశగా ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి వర్గాలకు ఈ పథకం ఎంతగానో ఊరటనిస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ఉచిత, సబ్సిడీ పంపిణీ ద్వారా మార్కెట్లో బియ్యం ధరలు అదుపులోకి వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

