సెక్షన్ 22-Aపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వ, దేవాదాయ, అసైన్డ్, సీలింగ్ మిగులు భూములు అన్యాక్రాంతం కాకుండా 22-Aను రూపొందించామని, 2007లో తీసుకొచ్చిన ఈ విధానంలో సమూల మార్పులు చేస్తూ పాత సర్క్యులర్లను రద్దు చేస్తున్నామని తెలిపారు. ఈ కొత్త నిర్ణయంతో భూములను 22-A జాబితా నుంచి తొలగించే ప్రక్రియ సులభతరం కానుంది. అదే సమయంలో.. కొత్త భూములను ఈ జాబితాలో చేర్చాలంటే మాత్రం అత్యంత కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
ఇకపై మ్యాన్యువల్ ఎంట్రీలను పూర్తిగా నిషేధిస్తూ, ప్రతి వారం వెబ్ల్యాండ్ 2.0 డేటాను ఐజీఆర్ఎస్ (IGRS) డేటాబేస్తో సింక్రనైజ్ చేస్తారు. నిషేధిత ఆస్తుల వివరాలన్నింటినీ ఓపెన్ డొమైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. గ్రామకంఠం, పట్టా భూములు, విలేజ్ సర్వీస్ ఇనాం భూములను అనవసరంగా 22-Aలో చేర్చితే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అలాగే చట్టబద్ధంగా క్రమబద్ధీకరించిన ULC భూములు, APSFC వేలంలో కొనుగోలు చేసిన భూములను అర్హత మేరకు 22-A నుంచి తొలగిస్తారు. కోర్టు ఉత్తర్వులు వచ్చిన ఐదు రోజుల్లోనే సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా.. ఏదైనా భూమిని 22-Aలో చేర్చే ప్రక్రియను క్వాసి జ్యుడీషియల్ ప్రక్రియగా పరిగణిస్తారు. భూమిని చేర్చే ముందు యజమానికి నోటీసు ఇచ్చి, విచారణ జరిపిన తర్వాతే స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. భూమి ప్రభుత్వానిదని నిరూపించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుంది తప్ప భూ యజమానులపై కాదు. 22-A జాబితాలో భూమిని చేర్చడం లేదా తొలగించే అధికారం ఆర్డీవో (RDO) లేదా సబ్ కలెక్టర్కు ఉంటుంది. వీరి నిర్ణయంపై జాయింట్ కలెక్టర్ అప్పీలేట్ అథారిటీగా వ్యవహరిస్తారు.
నూతన సాఫ్ట్వేర్ వ్యవస్థను 90 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని, అయితే కొత్త జీవో నిబంధనలు మాత్రం తక్షణమే అమల్లోకి వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో గతంలో రీసర్వే జరిగిన 6,688 గ్రామాల్లో తప్పులను సరిదిద్దుతూ, త్వరలోనే మరో 4 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తి చేస్తామన్నారు. రైతులు, పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ వ్యవస్థలో పారదర్శక సంస్కరణలు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

