Site icon NTV Telugu

Ration Card Holders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ..

Kiorrrrrr

Kiorrrrrr

ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ సరఫరాలో తలెత్తిన తాత్కాలిక ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రేషన్ కార్డుదారులకు ఊరటనిస్తూ మళ్లీ కిరోసిన్ పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం నుంచే ఈ పంపిణీ ప్రక్రియ షురూ కానుంది.

కిరోసిన్ పంపిణీకి కారణాలివే..

హార్ముజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ నౌకల రాక ఆలస్యమైంది. ఈ నెల 21న విశాఖకు చేరుకోవాల్సిన నౌక 26వ తేదీకి వాయిదా పడటంతో.. గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం సుమారు 2,800 కిలో లీటర్ల కిరోసిన్‌ను రాష్ట్రానికి కేటాయించింది. వాస్తవానికి ఏపీని ఇదివరకే ‘కిరోసిన్ రహిత రాష్ట్రం’గా ప్రకటించినప్పటికీ.. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మినహాయింపు ఇచ్చింది.

Also Read:Press Sticker: వాహనాలపై PRESS స్టిక్కర్లు.. సుప్రీం కోర్టు ఏమందంటే..

ముందుగా ఎక్కడంటే..?

ఈ కిరోసిన్ పంపిణీని తొలుత గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఒక్కో కార్డుపై లీటరు చొప్పున రేషన్ దుకాణాల ద్వారా దీనిని సరఫరా చేస్తారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలపై వస్తున్న వదంతులను నమ్మవద్దని మంత్రి సూచించారు. స్కూళ్లు, ఆస్పత్రులు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే.. గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణా లేదా బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఓటీపీ (OTP) విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ కంపెనీలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని.. అతి త్వరలోనే సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Exit mobile version