ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా వేలాది మంది దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతూ లబ్ధి పొందుతున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దివ్యాంగులకు అనేక సంక్షేమ ఫలాలు అందాయని, ఇప్పుడు కూడా అదే బాటలో ప్రభుత్వం పయనిస్తోందని ఆయన గుర్తు చేశారు.
శ్రీకాకుళంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ పథకం ఇప్పటికే అద్భుత విజయాలను నమోదు చేసిందని మంత్రి తెలిపారు. సుమారు 150 కోట్ల మంది మహిళలు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడం ఒక చారిత్రాత్మక రికార్డు అని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని కూడా దివ్యాంగులందరికీ చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
Also Read:Peddi: ‘పెద్ది’ సెట్స్లో వరల్డ్ కప్ హీరో.. రామ్ చరణ్ స్పోర్ట్స్ యాక్షన్కు యువ క్రికెటర్ ఫిదా!
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12.70 లక్షల మంది దివ్యాంగులు ఉండగా.. ప్రస్తుతం కేవలం 2 లక్షల మందికి మాత్రమే ఆర్టీసీ పాస్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 42 వేల మంది దివ్యాంగులందరికీ ఈ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పాస్ల జారీ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి, విధానాన్ని మరింత సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతీ బస్టాండ్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వంద శాతం పాస్లు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం కేవలం ఉచిత ప్రయాణానికే పరిమితం కాకుండా.. రానున్న రోజుల్లో బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ, ప్రత్యేక ఉపాధి కల్పన పథకాలు, పెన్షన్ల పెంపు వంటి అంశాలపై కూడా దృష్టి సారించనుంది. సమాజంలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా భౌతిక, ఆర్థిక భద్రతను కల్పించడమే ఈ కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి పేర్కొన్నారు.
