Site icon NTV Telugu

Kottu Satyanarayana: చంద్రబాబుపై సంచలన ఆరోపణలు.. పవన్‌పై పథకం ప్రకారం కుట్ర..!

Kottu Satyanarayana 2

Kottu Satyanarayana 2

Kottu Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. 2024 ఎన్నికల్లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సహా చాలా మంది ఖాతాలు మూయిస్తాం అంటూ కామెంట్ చేశారు.. అమరావతి నిర్మాణంలో భాగస్వామి అవుతుందని ప్రకటించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సొంత దేశంలోనే అరెస్టు అయ్యారని గుర్తుచేసిన ఆయన.. ఇక్కడా అమరావతి భూముల వ్యవహారంపై దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు. ఇక, అవాకులు చెవాకులతో పవన్ కల్యాణ్ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది.. ఆయన గ్రాఫ్ పడేసేందుకు పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్‌ను శాశ్వతంగా అడ్డు తొలగించుకునేందుకు ఆయనతో లేని పోని ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు.. అంతేకాదు.. ప్రజారాజ్యం పార్టీని మూయించే వరకూ చంద్రబాబు నిద్రపోలేదంటూ హాట్‌ కామెంట్లు చేశారు. ఇక, శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ తప్పు ఉంటే.. ప్రభుత్వం తప్పకుండా ఆమెపై చర్యలు తీసుకుటుందని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.

Read Also: Opposition Alliance: విపక్షాల కూటమి కొత్త పేరు INDIA..

మరోవైపు.. చంద్రబాబు లాంటి శనిని నెత్తి మీద పెట్టుకుని పవన్ కల్యాణ్‌ ఊరేగుతున్నారని గతంలో విమర్శించిన కొట్టు సత్యనారాయణ.. చంద్రబాబును వదిలేస్తేనే పవన్‌కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని సూచించిన విషయం విదితమే.. గత ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని కూడా పవన్ కాపాడుకోలేకపోయారని ఎద్దేవా చేసిన ఆయన.. హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత కూడా పవన్ కల్యాణ్ కు లేదని విమర్శించారు.. హిందూ సంస్కృతి గురించి పవన్ కు ఏం తెలుసని ప్రశ్నించారు. రోజురోజుకు పవన్ దిగజారి పోతున్నారని.. హిందూ ధర్మాన్ని కూడా పాటించలేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దుయ్యబట్టిన విషయం విదితమే.

Exit mobile version