NTV Telugu Site icon

CM YS Jagan: గ్రేట్ డేంజర్ దిశగా మిచౌంగ్ తీవ్ర తుఫాన్.. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

Michaung

Michaung

Cyclone Michaung: మిచౌంగ్ తీవ్ర తుఫాన్‌తో ఉప్పెన ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. మీటర్ అంతకు మించిన ఎత్తున సముద్రపు అలలు విరుచుకుపడి.. ఐదు కిలోమీటర్ల ముందుకు సముద్రపు నీరు చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నెల్లూరుకు 170కి.మీ దూరంలో కొనసాగుతున్న మిచౌంగ్.. రేపు ఉదయం బాపట్ల-దివిసీమ మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది. నిజంపట్నం,మచిలీపట్నం పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10, కాకినాడ 9,కృష్ణపట్నంలో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయ. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో 20సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో తీరం వెంబడి 100నుంచి 110కి.మీ వేగంతో వీయనున్నాయి. తీరం దాటిన తర్వాత కూడా తుఫాన్‌గా కొనసాగనున్న మిచాంగ్ ఉద్ధృతి కొనసాగుతుంది. దక్షిణ కోస్తాకు రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీ, తెలంగాణ,చత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడుపై మిచౌంగ్‌ ప్రభావం చూపనుంది.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తుఫాన్‌పై 8 మంది జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. తుఫాను సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. హుద్‌హుద్‌ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉందని సీఎం పేర్కొన్నారు. తుఫాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉందన్నారు. తుఫాన్‌ పట్ల అప్రమత్తంగా ఉంటూ, యంత్రాంగం సీరియస్‌గా ఉండాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారని ఆయన అన్నారు. గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారన్నారు. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశామని సీఎం చెప్పారు. అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి జిల్లాకు సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నామన్నారు. వీరంతా కూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని సీఎం చెప్పారు.

Read Also: Michoung Cyclone: తీవ్రతరమైన మిచౌంగ్ తుఫాన్.. స్తంభించిన తమిళనాడు

సీఎం జగన్‌ మాట్లాడుతూ..” ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు. ఆమేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి. కోతకు వచ్చిన ఖరీఫ్‌ పంటను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది. నిన్న ఒక్కరోజే 97 వేల టన్నలు ధాన్యాన్ని సేకరించాం. 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పంటకోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు చెప్తున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి. కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలి. యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవండి. తుఫాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. అన్నిరకాలుగా రైతులకు తోడుగా నిలవడం అన్నది అంత్యంత ప్రాధాన్యతాంశం. తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని చెప్తున్నారు. అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5, ఎస్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5 కూడా ఉన్నాయి.” అని సీఎం పేర్కొన్నారు.

Read Also: Chandrababu: తుఫాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి..

సీఎం జగన్‌ మాట్లాడుతూ..”ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఉంది. విలేజ్‌ క్లినిక్స్‌, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయి. ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం. ఇతర రాష్ట్రాలకు ఇలాంటి వ్యవస్థ లేదు. ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలి. ఈ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తపాను వల్ల, భారీవర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలన్నారు.