NTV Telugu Site icon

CM Chandrababu: అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Chandrababu

Chandrababu

CM Chandrababu: సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నూతన పాలసీతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సమగ్ర మార్పులతో 7-8 శాఖల్లో నూతన పాలసీలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మూడు నెలలుగా కొత్త పాలసీలపై అధికారులు సమగ్ర కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి సూచనలు, పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఉత్తమ ఫలితాలు ఇచ్చిన ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా వివిధ డ్రాఫ్ట్ పాలసీలను అధికారులు రూపొందించారు. ఎంప్లాయిమెంట్ ఫస్ట్ ( ఉద్యోగ కల్పన ప్రథమ లక్ష్యం) అనేదే ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడుదారులను ఆకర్షించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మార్గం సుగమం చేసేలా నూతన పాలసీలు తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రతి పాలసీ తయారీలో తన అనుభవాలు, ఆలోచనలు పంచుకున్న ముఖ్యమంత్రి.. ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలన్నారు.

Read Also: Heavy Rains: అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరిక

పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడులు పెట్టే విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా నిలవాలన్నారు. వచ్చే క్యాబినెట్ ముందుకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ నూతన పాలసీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలు తెచ్చేందుకు నిర్ణయించారు. పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్ మెంట్, డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇచ్చిన మొదటి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా డ్రాఫ్ట్ పాలసీలో ప్రతిపాదనలు చేయాలన్నారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అడిషనల్‌గా 10 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంలో ఆలోచనలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఆయా సంస్థలకు జాప్యం లేకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా ఇన్సెంటివ్స్ దక్కుతాయని…ఇది పారిశ్రామిక ప్రగతికి, ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందన్నారు. త్వరితగతిన ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ఇలాంటి కీలక నిర్ణయాలు దోహదం చేస్తాయన్నారు.

ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను, విధివిధానాలను సమగ్రంగా స్టడీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒక కుటుంబం.. ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్‌తో ఎంఎస్‌ఎంఈ పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రత్యేక హబ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. స్కిల్స్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో హబ్‌కు అనుంబంధంగా సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో సెంటర్‌కు ఒక్కో మల్టీనేషనల్ కంపెనీ మెంటార్‌గా ఉండేలా ప్రతిపాదనలు చేయాలన్నారు. ఆక్వా, ఫౌల్ట్రీ రంగంలో వచ్చిన విధంగా ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఫలితాలు వచ్చే విధానాలపై చర్చించారు. ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెన్టివ్ వచ్చేలా ప్రతిపాదనలు చేయాలన్నారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీపైనా చర్చించారు. మరింత కసరత్తు తరువాత క్యాబినెట్ ముందుకు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ రావాలన్నారు. ఈ సమీక్షకు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, అధికారులు హాజరయ్యారు.