NTV Telugu Site icon

AP CM Chandrababu: ఉన్నత విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu

Chandrababu

AP CM Chandrababu: ఉన్నత విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం.. పోస్టుల భర్తీ, ప్రమాణాల పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని విశ్వవిద్యాలయాలు తీసుకు రావాలన్నారు. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఛైర్ పర్సన్స్ గా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. పీపీపీ విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి కరిక్యులం మార్పునకు నిపుణులతో కమిటీ వేయాలన్నారు.

రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో వీసీల ఎంపిక జరుపుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌కు 5 ఏళ్ల యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్నారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలు, ఉన్నత విద్యా రంగంపై చిన్న చూపు కారణంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్టార్ గాడి తప్పిందన్నారు. ఉన్నత విద్యారంగాన్ని తిరిగి పట్టాలెక్కించి, మంచి ఫలితాలు సాధించేందుకు స్వల్పకాలిక, దీర్ఘ కాలిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతంపై తక్షణం దృష్టిపెట్టాలన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం.. అదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు యూనివర్సిటీలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు.