AP Cabinet Key Decision: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక స్పష్టం చేసినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ అంశంపై తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో టెండర్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగినట్లు మంత్రి తెలిపారు. వైష్ణవి డైరీ పేరుతో టెండర్లో పాల్గొన్న సంస్థ పూర్తిగా నకిలీ పత్రాలు సమర్పించినట్లు సిట్ నివేదికలో తేలిందన్నారు. మూడు సంవత్సరాల అనుభవం ఉన్నట్లు చూపించినా, ఆ సంస్థకు డైరీ కార్యకలాపాల అనుభవం ఒక్క సంవత్సరానికి కూడా లేనట్లు వెల్లడైందని చెప్పారు.
తమ కళ్లముందే ఈ అక్రమాలు జరిగినా అధికారులు, బోర్డు నేతృత్వం వహించిన వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్రమైన తప్పిదమని మంత్రి పేర్కొన్నారు. తెలియకపోతే నిర్లక్ష్యం, తెలిసి కూడా చర్యలు తీసుకోకపోతే నేరంలో భాగస్వామ్యమేనని స్పష్టం చేశారు. సిట్ నివేదికలో ప్రస్తావించిన వారందరినీ నేరస్తులుగానే పరిగణిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సప్లిమెంటరీ చార్జ్ షీట్ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందన్నారు. కోర్టు ఈ పత్రాలను స్వీకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. చార్జ్ షీట్లో మరికొందరి పేర్లు లేకపోతే కోర్టు తిరిగి పంపే అవకాశం ఉందని కూడా వివరించారు.
iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్కు శుభవార్త.. యూస్ నుంచి ఈజీగా ‘ఐఫోన్ 17’ తెచ్చేసుకోవచ్చు!
అడ్మినిస్ట్రేటివ్ లోపాలు ఉన్నాయా అన్నది తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కమిటీ తక్కువ కాల వ్యవధిలోనే నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకునే ముందు వారికి తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ కక్షతో చర్యలు తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు. తిరుమల దేవస్థానం పవిత్రతను కాపాడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సిట్ నివేదికలో పేర్కొన్న వారితో పాటు మరికొందరు బాధ్యులు ఉన్నారా అన్నదానిపై కూడా కమిటీ దృష్టి సారించనున్నట్లు తెలిపారు. దీనితో ఈ ఘటనపై ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం భక్తులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.