NTV Telugu Site icon

AP Cabinet: ఏపీ కేబినెట్‌ ముందు 49 అంశాలు.. వారికి గుడ్‌న్యూస్‌..!

Ys Jagan

Ys Jagan

AP Cabinet: సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది.. మొత్తంగా 49 అంశాలపై కేబినెట్‌ చర్చించనుంది.. ఇందులో పలు కీలక అంశాలు ఉన్నాయి.. నిరుద్యోగులకు శుభవార్త చెప్పే అంశాలు కూడా ఉన్నాయి.. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం తీసుకురాబోతున్నారు.. ఈ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చనింది ప్రభుత్వం. UPSCలో ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్ధిక సాయం చేయనుంది సర్కార్‌..

ఇక, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుపై కేబినెట్‌ చర్చించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు ముసాయిదా బిల్లుపై చర్చ జరగనుండగా.. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుపై చర్చ ఉంటుంది.. జగనన్న ఆరోగ్య సురక్ష పై కేబినెట్‌లోచర్చ సాగుతుండగా.. కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనపై కూడా చర్చిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లుపై కేబినెట్‌లో చర్చకు రానుంది.. పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణం కి ఆమోదం తెలపనుంది కేబినెట్‌.. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు పీఓటీ చట్ట సవరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు పై చర్చ సాగనుండగా.. దేవాదాయ చట్ట సవరణపై కేబినెట్‌ చర్చించనుంది.. ఒంగోలు, ఏలూరు, విజయవాడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో 123 టీచింగ్, 45 నాన్ టీచింగ్ పోస్టులకు ఆమోదం తెలపబోతోంది..

రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలో శాశ్వత ఉద్యోగుల నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.. సీపీఐ మావోయిస్టు, రేవుల్యూషనరి డెమొక్రటిక్ ఫ్రంట్ లను మరో ఏడాది పాటు నిషేధిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబ సభ్యులకు ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ద్వారా భద్రత కల్పించే బిల్లుకు ఆమోదం తెలపనుంది ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం.